ఎన్నో వేల కిలోమీటర్ల పాదయాత్ర చేసి ప్రజల కష్టసుఖాలను, అవసరాలను దగ్గర నుంచి చూసి అక్కడికక్కడే వారికీ తన పార్టీ అధికారంలోకి వస్తే ఏం చేస్తామనేది హామీలిచ్చి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన జగన్, ప్రభుత్వాన్ని ఎలా నడపాలో తెలియదన్నట్టు దేశంలో ఎక్కడ లేని విధంగా ఏకంగా 40 మంది సలహాదారులను నియమించారు.
ఈ సలహాదారుల సంఖ్యలో కూడా వైసీపీ ప్రభుత్వానికి హైకోర్టు మొట్టికాయలు వేసిన మాట వాస్తవం. ప్రభుత్వ ఖజానా నుండి వారికి లక్షల్లో జీతాలు,హై కోర్ట్ న్యాయమూర్తికి సైతం లేని ప్రత్యేక సౌకర్యాలు కల్పిస్తూ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై పడే భారాన్ని అర్ధం చేసుకోకుండా ఈ నిర్ణయాలు సరికాదు కదా అంటూ హైకోర్టు కూడా జగన్ నిర్ణయాన్ని తప్పుబట్టింది.
అయితే దేశంలో ఎక్కడా లేని మూడు రాజధానుల కాన్సెప్ట్ సౌత్ ఆఫ్రికా నుంచి దిగుమతి చేసుకుని ఏపీలో అమలు చేసిన జగన్ ఇప్పుడు ఈ 40 మంది సలహాదారుల కాన్సెప్ట్ ఈ దేశం నుంచి దిగుమతి చేసుకున్నారో కానీ ఏపీకి మోయలేని భారంగా మారింది. కనీసం ఆ భారానికి తగ్గ ప్రతిఫలం తిరిగి రాష్ట్రం కానీ రాష్ట్ర ప్రజలు కానీ అనుభవిస్తున్నారా అంటే ఇక దాని గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచి అన్నట్టు ఉంది పరిస్థితి.
గత ప్రభుత్వాన్ని మరిపించేలా పాలనా సలహాలు ఇవ్వాల్సిన సలహాదారులు నిత్యం గత ప్రభుత్వాన్ని తలచుకునేలా, గత ప్రభుత్వంతో సరిపోల్చుకుంటూ ఇదెక్కడి ఖర్మరా బాబు అనేలా వైసీపీ ప్రభుత్వ సలహాదారుల సలహాలు ఉంటున్నాయి.కొత్త ఆలోచనలు, కొత్త నిర్మాణాలతో, కొత్త పరిశ్రమలతో రాష్ట్రాన్ని పరుగులు పెట్టిస్తాడని భావించిన ఏపీ ప్రజలకు కూల్చివేతలను పరిచయం చేశారు జగన్, అతని సలహాదారులు.
రాజధానికి పునాదులు వేసి నాలుగేళ్లలో దానికి ఒక రూపం తెచ్చి దేశంలోనే అమరావతికి ఒక గుర్తింపు తెచ్చిన టీడీపీ పార్టీని కాదని అంతకు మించి వైసీపీ ప్రభుత్వం తమ రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా అడుగులు వేయించగలదని ఏపీ ప్రజలు ఒక్క ఛాన్స్ వైపు మొగ్గు చూపారు. ఇప్పుడు దాని ఫలితం కూడా అనుభవిస్తున్నారనుకోండి. “పొద్దుపొడవగానే నిరసనలు…, పొద్దుగూకగానే అరెస్టులు”..,ప్రస్తుతం రాష్ట్రంలో ఇదే నడుస్తుంది.
ప్రతిపక్ష పార్టీల నేతలు నోరు విప్పితే కేసులు, అడుగువేస్తే అరెస్టులు అన్నట్టు తయారయ్యింది ఈ రాష్ట్రంలో. ప్రత్యర్థి పార్టీ అధినేతలు తమ పార్టీ ప్రచారాలకు వెళ్లాలన్న ఆంక్షలే, ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించడానికి సభలు పెట్టాలన్న ఆంక్షలే, కనీసం తమ నాయకుడికి మద్దతుగా నిలబడాలన్న హౌస్ అరెస్టులంటూ నిర్బంధాలు. ఆంక్షలతో, నిర్బంధాలతో ప్రభుత్వాన్ని నడపాలని ప్రభుత్వ సలహాదారులు జగన్ కు సలహాలు ఇస్తున్నారేమో మరి.
ప్రభుత్వం ఇలా వ్యవస్థలను అడ్డుపెట్టుకుని ప్రతిపక్షాలను కట్టడి చేయాలి, ఎదిరించిన వారిని తప్పుడు కేసులు పెట్టి అరెస్టు చేయాలి, మాట వినని వారిని రిమాండుకి తీసుకుని అరికాళ్ళ మంత్రం వేయాలంటూ సలహాలిస్తున్న ఆసలహాదారులెవరో కానీ ఆ సలహాల అమలుతో జగన్ రాష్ట్ర పరువుని పక్క రాష్ట్రాల ముందు బజారుకీడుస్తున్నాడు. రాజకీయాలలోకి వ్యక్తిగత విమర్శలు తీసుకువచ్చి రాజకీయాలకు సంబంధం లేని కుటుంబసభ్యులను రోడ్డుకు లాగుతున్నారు.
అలాగే రాజకీయాలలోకి బూతుల సంస్కృతిని పరిచయం చేసిన ఘనత కూడా ఈ ప్రభుత్వ పెద్దలే దక్కింది. ప్రతిపక్షాలను బెదరగొట్టడం,పెట్టుబడి దారులను భయపెట్టడం, రాష్ట్రంలో రాజకీయ అస్థిరత్వాన్ని తీసుకురావడం,ఓట్ల రాజకీయాలను దృష్టిలో ఉంచుకుని తలకు మించిన సంక్షేమాన్ని నెత్తినేసుకోవడం, రాష్ట్రాన్ని అప్పులకుప్పగా మార్చడం, ప్రతిపక్ష నేతలపై పగ తీర్చుకోవడం, వంటి సలహాలతో చివరికి నష్ట పోయేది రాష్ట్రం, ప్రజలే.
ఈ సలహాలను క్షుణ్ణంగా పరిశీలిస్తే ఇవన్నీ పాలన ముందుకు తీసుకువెళ్ళడానికి ఇచ్చే సలహాలా? లేక తమ వ్యక్తిగత వైరాలు తీర్చుకోవడానికి జగన్ కు దొరికిన అవకాశాలా? అన్నట్టుంది. అసలు ఇంతమంది సలహాదారులు లేకపోతే ప్రభుత్వాన్ని నడపలేని వ్యక్తి అసలు ముఖ్యమంత్రి పదవికి అర్హుడేనా? ప్రభుత్వ తీసుకున్న నిర్ణయాలను ప్రజలకు వివరించాలన్నా, విపక్షాల విమర్శలకు సమాధానం చెప్పాలన్నా కూడా మీడియా ముందుకు వచ్చేది ఈ ప్రభుత్వ సలహాదారులే.”అసలు తాము ఓటేయని ఈ సలహాదారులే ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారా”? అనేది ప్రజలు కూడా ఒక్కసారి ఆలోచించాలి.




