గత ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేసిన అంశాలలో వైఎస్ వివేకానంద రెడ్డి దారుణహత్య కేసు కూడా ఒకటని అందరికీ తెలుసు. వివేకా హత్యను తనకు అనుకూలంగా మలుచుకొని ఎన్నికలలో వైసీపీ ఎంతో కొంత లబ్ధి పొందగలిగిందనే సంగతి తెలిసిందే. అయితే అదే కేసు 2024లో జరుగబోయే ఎన్నికలలో వైసీపీ మెడకు ఉరితాడులా చుట్టుకొనే సూచనలు కనిపిస్తున్నాయి.
వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ కేసు తమ చేతిలో ఉన్నప్పుడే ‘మమ’ అనిపించేసి విచారణ ముంచేసే అవకాశం ఉంది. లేదా వైసీపీ మేధావులు ఆరోపిస్తున్నట్లు తమ రాజకీయ ప్రత్యర్ధిని చంద్రబాబు నాయుడుని ఆ కేసులో ఇరికించేసే అవకాశం కూడా ఉంది. కానీ ఎందువల్లో ఆ కేసు విచారణను చేజేతులా సీబీఐకి అప్పగించి దానితో మూడేళ్ళు ఆటలాడుకొని ఇప్పుడు సీబీఐనే నిందిస్తూ తాపీగా బాధపడుతోంది.
కారణాలు ఏవైతేనేమీ ఆ కేసు విచారణ ఇంకా పూర్తవలేదు కానీ మళ్ళీ ఎన్నికలు వచ్చేస్తున్నాయి. ఒకవేళ జగన్ ప్రభుత్వం పట్ల కేంద్రప్రభుత్వం వైఖరి మారడం నిజంగా నిజమైతే, సరిగ్గా ఎన్నికలకు ముందు ఆ కేసు వైసీపీ మెడకు ఉరితాడులా బిగుసుకోవచ్చు. ఈ విషయం వైసీపీ కూడా బాగానే గ్రహించిన్నట్లుంది. అందుకే సజ్జల రామకృష్ణారెడ్డి చేత ప్రెస్మీట్లు పెట్టించి మాట్లాడిస్తూ ప్రజలను ప్రభావితం చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు భావించవచ్చు. అయితే కుంటిసాకులతో పిటిషన్లు వేస్తూ ఈ కేసును ఇంతకాలం సాగదీయడమే తప్పని ఇప్పుడు అర్దమవుతోంది. కానీ చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకొని ఏం ప్రయోజనం?



