టీడీపీకి ఇలాంటి రాజకీయాలు అవసరమా?

TDP Rajyasabha Seats

“నేను ఆ సినిమా చేయకపోతే బాగుండేది కానీ చేసి తప్పు చేశాను,” అని సినీ నటులు ఏదో సందర్భంలో చెపుతుంటారు. అలాగే రాజకీయాలలో కూడా కొన్నిసార్లు అయిష్టంగానైనా కొన్ని నిర్ణయాలు తీసుకోక తప్పదు.

ఏపీలో వైసీపీ ఘోర పరాజయం తర్వాత పలువురు వైసీపీ నేతలని టీడీపీ, జనసేనలలో చేర్చుకోవడం కూడా అటువంటిదే అని చెప్పవచ్చు. వారి చేరికలను ఆ రెండు పార్టీల నేతలు అభ్యంతరం చెపుతున్నప్పటికీ రాజకీయ లాభనష్టాల లెక్కల కోసం తీసుకోవలసి వస్తోంది.

ADVERTISEMENT

కానీ పార్టీలో అనేక మంది సీనియర్లు ఉండగా వారిని కాదని వైసీపీ నుంచి వచ్చిన వారికి పదవులు ఇవ్వడాన్ని ఎవరూ హర్షించలేరు.

వైసీపీకి చెందిన బీద మస్తాన్ రావు, మోపిదేవి వెంకటరమణ, ఆర్‌. కృష్ణయ్య ముగ్గురూ తమ రాజ్యసభ పదవులకు రాజీనామా చేశారు. వారిలో మోపిదేవి వెంకటరమణ టీడీపీలో చేరిపోయి మళ్ళీ రాజ్యసభ సీటు దక్కించుకోబోతుండగా, ఆర్‌. కృష్ణయ్య బీజేపిలో చేరిపోయి తన సీటు దక్కించుకోబోతున్నారు.

మూడో సీటు జనసేనకు లభిస్తుందని అనుకున్నప్పటికీ బీద మస్తాన్ రావు ఖాళీ చేసిన సీటు కూడా టీడీపీ తీసుకోబోతోంది.

రాజ్యసభలో బలం పెంచుకోవడానికి టీడీపీకి ఇది చాలా చక్కటి అవకాశం. అయితే వైసీపీ నుంచి వచ్చిన మోపిదేవికి ఆ సీటుని కట్టబెట్టడం సరైన నిర్ణయం కాదనే అనిపిస్తుంది. ఎందువల్ల అంటే, కష్టకాలంలో కూడా టీడీపీని అంటిపెట్టుకొని, జగన్‌ ప్రభుత్వం వేధింపులు భరిస్తూ, పార్టీ క్యాడర్ చెల్లాచెదురు కాకుండా కాపాడుకుంటూ ఎన్నికలలో పార్టీని గెలిపించుకున్న టీడీపీ నేతలకు ఈ పదవి ఇచ్చి ఉంటే వారిని సముచితంగా గౌరవించిన్నట్లు ఉండేది.. టీడీపీకి విశ్వసనీయమైన రాజ్యసభ సభ్యులు ఉండేవారు కదా?

కానీ టీడీపీ నేతలకు దక్కాల్సిన ఆ సీటుని వైసీపీ నుంచి వచ్చిన మోపిదేవికి మళ్ళీ కట్టబెట్టడాన్ని టీడీపీ నేతలు కూడా జీర్ణించుకోవడం కష్టమే. టీడీపీకి ఇప్పుడు ఇంత బలం, రాష్ట్ర రాజకీయాలపై ఇంత పట్టు సాధించిన తర్వాత ఇంకా వైసీపీ నేతలని చంకనెక్కించుకోవడం అవసరమా?

ADVERTISEMENT
Latest Stories