అమరావతిని ఆంధ్రప్రదేశ్ రాజధానిగా ఖరారు చేసేందుకు నిర్దేశించిన బిల్లుని కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో బుధవారం లోక్సభలో ప్రవేశపెట్టబోతోంది. అక్కడ రేపు ఆమోదముద్ర పడితే మర్నాడు రాజ్యసభకు చేరుతుంది. అక్కడా ఆమోద ముద్ర పడితే రాష్ట్రపతి వద్దకు చేరుతుంది.
పార్లమెంట్ ఆమోదించిన బిల్లులకు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్మూ ఆమోదం ముద్ర వేయడం లాంఛనప్రాయమే. కనుక ఈ వారాంతంలోగా ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతికి రాజముద్ర పడటం ఖాయమే.
జగన్ హయంలో ఎదురైన చేదు అనుభవాలు దృష్టిలో ఉంచుకొని కూటమి ప్రభుత్వం ఈ ముందస్తు జాగ్రత్త తీసుకోక తప్పడం లేదు. అయితే ఇప్పటికీ తాము అమరావతికి వ్యతిరేకమేనని బొత్స, ధర్మాన, సీదిరి తదితరులు స్పష్టంగానే చెప్తున్నారు.
మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ మొన్న శాసనసభలో మాట్లాడుతూ, “లంకలో ఉన్నవాళ్ళందరూ రాక్షసులు కారు. ఆనాడు మాలాంటి వాళ్ళు కొందరం మూడు రాజధానుల నిర్ణయం సరికాదని జగన్మోహన్ రెడ్డికి నచ్చజెప్పేందుకు చాలా ప్రయత్నించాము. కానీ అయన వినలేదు. ఆయన మాట కాదంటే అప్పుడు మాకూ మీ (రఘునందన్ రావు)గతే పట్టేది. కనుక అందరం నోరు మూసుకున్నాం,” అని అన్నారు.
కనుక వైసీపీలో బొత్స సత్యనారాయణ వంటివారు కూడా జగన్ని కాదనలేకనే అమరావతికి వ్యతిరేకంగా మాట్లాడున్నట్లు భావించాల్సి ఉంటుంది. వారికి ఏ పార్టీలో చేరేందుకు అవకాశం లేదు. కనుక జగన్నే నమ్ముకొని అమరావతిని వ్యతిరేకించక తప్పడం లేదు.
అమరావతిని వ్యతిరేకిస్తే రాజకీయంగా నష్టపోతామని వారికీ తెలుసు. కానీ జగన్ ఏదో మాయ చేసి తమని ఒడ్డున పడేస్తారనే నమ్మకంతోనే గుడ్డిగా ఆయనని నమ్ముకొని మాట్లాడుతున్నారు.
కానీ రేపు అమరావతికి పార్లమెంట్ ఆమోదముద్ర వేసిన తర్వాత జగన్ కూడా ఏమీ చేయలేరు. కూటమి ప్రభుత్వం మిగిలిన ఈ మూడేళ్ళలో అమరావతికి రూపురేఖలు తెచ్చి, దానినే ఎన్నికలలో హైలైట్ చేస్తూ ప్రచారం చేసుకోకుండా ఉండదు.
అప్పుడు కూడా జగన్ కోసం వైసీపీ నేతలు అమరావతికి వ్యతిరేకంగా మాట్లాడక తప్పదు. మాట్లాడితే ఏమవుతుందో వారికే బాగా తెలుసు.
రాజధాని విషయంలో తమది అప్పుడూ ఇప్పుడూ ఎప్పుడూ తప్పుడు విధానమే అని వైసీపీ నేతలకు తెలియదనుకోలేము. కానీ అందరూ వేరే గత్యంతరం లేకనే జగన్ని నమ్ముకొని గుడ్డిగా ముందుకు సాగుతున్నారు పాపం!






