ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలకు ముందే టీడీపి, జనసేన, బీజేపిలు పొత్తులు పెట్టుకున్నాయి. కలిసి పోటీ చేసి అధికారంలోకి వచ్చాయి. కనుక ఏపీలో కుమ్మక్కు రాజకీయాలకు అవకాశం లేదు. ఇది కూడా గొప్ప అదృష్టమనే చెప్పాలి. లేకుంటే తెలంగాణ రాజకీయాలలోలాగ చాలా గందరగోళంగా మారేవి.
ఏపీలో కూటమి ప్రభుత్వం, వైసీపీ మద్య మాత్రమే రాజకీయాలు జరుగుతున్నందున పిక్చర్ చాలా క్లారిటీగా ఉంది. కానీ తెలంగాణలో కాంగ్రెస్, బీజేపి, బీఆర్ఎస్ మూడు పార్టీల మద్య కుమ్మకు రాజకీయాలు ప్రజలను అయోమయానికి గురి చేస్తున్నాయి.
కాళేశ్వరం కేసుపై సీబీఐ ఎందుకు విచారణ మొదలుపెట్టలేదంటే, కేటీఆర్ వద్దని చెప్పడంతో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి బ్రేకులు వేశారని సిఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. బీసీ రిజర్వేషన్స్ పెంపు విషయంలో కూడా ఇదే జరిగిందని ఆరోపించారు.
ఈ ఆరోపణలను ఇటు బీజేపి, అటు బీఆర్ఎస్ నేతలు ఖండించకపోవడంతో వారిమద్య రహస్య అవగాహన ఉందనే అనుమానాలు వ్యక్తమవుతూనే ఉన్నాయి.
ఇదే సమయంలో బీఆర్ఎస్ పార్టీ కూడా సిఎం రేవంత్ రెడ్డి, ఏపీ సిఎం చంద్రబాబు నాయుడుతో కుమ్మక్కయ్యి తెలంగాణకు తీరని అన్యాయం చేస్తున్నారని పదేపదే ఆరోపిస్తున్నారు. వారు కూడా రాజకీయ కారణాలతో ఈ ఆరోపణలు ఖండించకపోవడంతో తెలంగాణ రాజకీయాలలో ఎవరు ఎవరితో కుమ్మక్కయ్యారో తెలీని పరిస్థితి నెలకొంది.
తెలంగాణలో ఎప్పటికైనా అధికారంలోకి రావాలని బీజేపి ఉవ్విళ్ళూరుతోంది. కనుక కాళేశ్వరం కేసుపై సీబీఐ విచారణకు ఆదేశించి బిఆర్ఎస్ పార్టీని చావు దెబ్బ తీయవచ్చు. కానీ సీబీఐ విచారణ జరిపించమని తెలంగాణ ప్రభుత్వం కోరినా కేంద్రం పట్టించుకోలేదు.
ఫోన్ ట్యాపింగ్ ఇంకా తీవ్రమైన నేరం. కానీ ఆ కేసులో కేసీఆర్ని తమ ప్రభుత్వం అరెస్ట్ చేయనీయకుండా కేంద్రం అడ్డుకుంటోందని సిఎం రేవంత్ రెడ్డి ఇదివరకే సంచలన వ్యాఖ్యలు చేశారు. కాళేశ్వరం కేసుపై
బీజేపి అధిష్టానం బీఆర్ఎస్ పార్టీ పట్ల ఇంత మెతక వైఖరి ఎందుకు ప్రదర్శిస్తుందో… అసలు దాని వ్యూహం ఏమిటో అంతుపట్టదు. ఇదే బీఆర్ఎస్ పార్టీకి శ్రీరామ రక్షగా నిలుస్తోందని చెప్పవచ్చు.




