జగన్ ప్రభుత్వం ఇప్పటికే పరిపాలన వికేంద్రీకరణ పేరుతో రాజధాని వికేంద్రీకరణ మొదలుపెట్టింది. రాష్ట్రానికి అమరావతి ఒక్కటే రాజధానిగా ఉంటే అభివృద్ధి అంత ఆ ఒక్క ప్రాంతానికే పరిమితం అవుతుందని, అలా కాకుండా పాలనా వ్యవస్థను మూడు రాజధానులుగా వికేంద్రీకరిస్తే రాష్ట్రం త్వరితగతిన అభివృద్ధి చెందుతుంది అనే నినాదంతో వైసీపీ పార్టీ ముందుకెళ్తుంది.
మూడు రాజధానుల పేరుతో వైసీపీ ప్రభుత్వం రాష్ట్రాన్ని., రాష్ట్ర ఆర్ధిక పరిస్థితులను పాతాళానికి పడేశారని ప్రతిపక్ష పార్టీలు., రాజధాని గ్రామస్తులు నాటి నుండి నేటి వరకు ఉద్యమాలు చేస్తూనే ఉన్నారు. ‘ఉద్యమాల పేరుతో ప్రజలు – కోర్టు తీర్పులతో న్యాయస్థానాలు’ జగన్ ప్రభుత్వాన్ని మూడు రాజధానుల దిశగా ఒక్క అడుగు కూడా ముందుకు వేయనివ్వడం లేదు.
ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది మొదలు ఈ ‘వికేంద్రీకరణ’ పేరుతో రాష్ట్రంలో అలజడిని., అశాంతిని తప్ప మరేం మిగల్చలేదంటూ తమ ఆవేదనను తెలియచేస్తున్నారు రాజధాని ప్రజలు. రాజధానుల వికేంద్రీకరణతో మొదలైన ఈ విధ్వంసం, జిల్లాల వికేంద్రీకరణతో అయినా ముగుస్తుందో., లేదో? అంటూ ప్రజలు నిట్టూరుస్తున్నారు.
ప్రభుత్వం తీసుకున్న ఈ జిల్లాల వికేంద్రీకరణ కూడా కొన్ని ప్రాంతాలలో విమర్శలను చవిచూడాల్సి వచ్చింది. ప్రజాభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకోకుండా నిర్ణయాలు తీసుకున్నారంటూ అటు ప్రజలు., ఇటు ప్రతిపక్ష పార్టీలు రోడ్ల మీదకు వచ్చి తమ నిరసనను తెలిపిన వైనాలు ఎన్నో కళ్ళ ముందు కదలాడుతున్నాయి.
మా ప్రభుత్వ విధానమే వికేంద్రీకరణ., అంటూ చెప్పుకొచ్చే వైసీపీ నాయకుల తమ పాలనా విధానాలతో నిరసనలు., ఉద్యమాల పేరుతో ప్రజలను ఒక దగ్గరకు కేంద్రకరిస్తున్నారని విపక్షాలు విమర్శిస్తున్నాయి. వికేంద్రీకరణతో రాష్ట్రం అభివృద్ధిలో “వెలిగిపోవడం” ఏమో కానీ., ప్రభుత్వ నిర్ణయాలు – ప్రతిపక్షాల నిరసనలతో ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆంక్షలతో., ఉద్యమాలతో “నలిగిపోతున్నారు”.అనేది అసలు వాస్తవం.



