“మరో రెండు నెలల్లో రాష్ట్రంలో అనూహ్యమైన రాజకీయ మార్పులు రాబోతున్నాయి. మళ్ళీ మనమే అధికారంలోకి రాబోతున్నాము. మరో 15 ఏళ్ళు మనమే అధికారంలో ఉండబోతున్నాము. కనుక ఎన్నికలలో ఓడిపోయామని పక్క చూపులు చూడొద్దు. ఎవరూ గోడ దూకొద్దు,” కేసీఆర్ ప్రతీరోజూ తన పార్టీ నేతలకు చెపుతున్న మాటలివి.
కానీ బిఆర్ఎస్ పార్టీ మళ్ళీ ఎలా అధికారంలోకి రాగలదో చెప్పడం లేదు. కనుక కేసీఆర్ తమని ఇంకా మభ్యపెట్టేందుకు పిట్ట కధలు చెపుతున్నారని బిఆర్ఎస్ నేతలు భావిస్తున్నట్లున్నారు.
అందుకే గురువారం అర్ధరాత్రి ఏకంగా ఆరుగురు బిఆర్ఎస్ ఎమ్మెల్సీలు కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. తెలంగాణ సిఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ నుంచి నిన్న అర్ధరాత్రి హైదరాబాద్ చేరుకున్నారు. అంతవరకు వారందరూ ఓపికగా ఓ స్టార్ హోటల్లో వేచి చూసి, సిఎం రాగానే జూబ్లీహిల్స్లోని ఆయన నివాసానికి వెళ్ళి, కాంగ్రెస్ కండువాలు కప్పించుకొని పార్టీలో చేరిపోయారు.
ఇది చూస్తే బిఆర్ఎస్ పార్టీలో నుంచి బయటపడేందుకు ఆ పార్టీ నేతలు ఎంత ఆతృతగా ఎదురుచూస్తున్నారో అర్దమవుతుంది. అంతేకాదు… బిఆర్ఎస్ నేతలు కేసీఆర్ నాయకత్వంపై నమ్మకం కోల్పోతున్నట్లు కూడా స్పష్టం అవుతుంది.
రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని పడగొట్టి అధికారం చేజిక్కించుకోవాలని తెర వెనుక ప్రయత్నాలు చేస్తున్నారని కేసీఆర్ మాటలే చెపుతున్నాయి. ఈ ఆలోచన కూడా బిఆర్ఎస్ నేతలకు ఆమోదయోగ్యం కాదని ఈ ఫిరాయింపులు స్పష్టం చేస్తున్నాయి. ఒకవేళ వారికి ఆమోదమైతే అందరూ కేసీఆర్ని అంటిపెట్టుకొని ఉండేవారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చేసేందుకు అందరూ కేసీఆర్కు సహకరించి ఉండేవారు కదా?
మరో విషయం ఏమిటంటే, కేసీఆర్ రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కూల్చేయాలని కేసీఆర్ అనుకుంటడం వల్లనే రేవంత్ రెడ్డి కూడా ముందు జాగ్రతపడేలా చేశారని చెప్పవచ్చు. అంటే ఆ విదంగా మాట్లాడి కేసీఆర్ వ్యూహాత్మకంగా కూడా తప్పు చేసిన్నట్లు భావించవచ్చు.
కనుక బిఆర్ఎస్ పార్టీ పతనానికి రేవంత్ రెడ్డి ఎంత కారణమో కేసీఆర్ కూడా అంతే కారణమని చెప్పక తప్పదు. కానీ కేసీఆర్ ఇది కూడా ఒప్పుకోవడం లేదు. కనుక బిఆర్ఎస్ పతనాన్ని ఎవరూ ఆపలేరు.




