చంద్రబాబు నిబద్దతకు ఇది నిదర్శనం కాదా?

International Experts Visit Polavaram

ప్రత్యేక హోదా తర్వాత ఎవరికీ అంతుపట్టని బ్రహ్మ పదార్ధంగా మిగిలిపోయింది ఏదైనా ఉందంటే అది పోలవరం ప్రాజెక్టు.

రాష్ట్ర రూపురేఖలనే మార్చివేయగల ఇంత గొప్ప ప్రాజెక్టుని ఏ ముఖ్యమంత్రి అయినా త్వరగా పూర్తిచేసి మంచి పేరు సంపాదించుకోవాలనుకుంటారు. కానీ విధ్వంసం తప్ప అభివృద్ధి అంటే తెలియని జగన్మోహన్‌ రెడ్డి, రివర్స్ టెండరింగ్‌తో పోలవరం పనులను నిలిపివేయించడమే కాకుండా, గత ఐదేళ్ళలో ఆ ప్రాజెక్టు పనులు ముందుకు సాగలేని విదంగా అంతా అస్తవ్యస్తం చేసేశారు.

ADVERTISEMENT

ఒక చిన్న ఇంటి నిర్మాణం నిలిచిపోతేనే ఎంతో నష్టం జరుగుతుంది. అలాంటిది లక్షల కోట్లతో నిర్మిస్తున్న పోలవరం ప్రాజెక్టు పనులు నిలిచిపోతే ఎంత నష్టం జరుగుతుంది?అని మేధావి జగన్‌కు తెలియకపోవడం ఆంధ్ర ప్రజల దురదృష్టమే.

తెలంగాణలో ఒక్క సాగునీటి ప్రాజెక్టుకైనా జాతీయ హోదా ఇవ్వాలని అక్కడి ప్రభుత్వాలు కేంద్రాన్ని ఎంతగా వేడుకుంటున్నా ఇవ్వడం లేదు. కానీ జాతీయ ప్రాజెక్టు హోదా కలిగిన పోలవరం ప్రాజెక్టు విలువ జగన్‌ గ్రహించలేకపోయారు. కనుకనే దానితో కూడా ఆడుకున్నారు.

కానీ సిఎం చంద్రబాబు నాయుడుకి దాని విలువ తెలుసు కనుకనే ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే నేరుగా పోలవరం ప్రాజెక్టు సందర్శించారు. జరిగిన నష్టాన్ని అంచనా వేసి, ఈ ప్రాజెక్టుని త్వరగా పూర్తిచేసేందుకు తగిన సూచనలు, సలహాలతో నివేదిక ఇచ్చేందుకు అమెరికా, కెనడా దేశాలకు చెందిన నలుగురు ఇరిగేషన్ నిపుణులను రప్పించారు. వారు జూలై 3 వరకు పోలవరం ప్రాజెక్టు అంతా పర్యటించి, అధికారులు, కాంట్రాక్ట్ కంపెనీలతో సమావేశమయ్యి చర్చిస్తున్నారు.

చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టగానే పోలవరం ప్రాజెక్టు పర్యటించడం, శ్వేతపత్రం విడుదల చేయడం వైసీపి జీర్ణించుకోవడం కష్టమే. కనుక పోలవరం ప్రాజెక్టు గురించి తనకు ఏమాత్రం అవగాహన లేదని నిసిగ్గుగా చెప్పుకున్న మాజీ మంత్రి అంబటి రాంబాబు కూడా పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా తమ ప్రభుత్వ హయాంలో జరిగిన పనులను మీడియాకు వివరించడం మరో సిగ్గుమాలిన పని!

పైగా చంద్రబాబు నాయుడు వలననే పోలవరం ప్రాజెక్టు నేడు ఈ దుస్థితిలో ఉందని ఆరోపించడం ఇంకా సిగ్గుచేటు. అంత పెద్ద జాతీయ ప్రాజెక్టుని కూడా భ్రష్టు పట్టించేసి మళ్ళీ నిసిగ్గుగా చంద్రబాబు నాయుడుని విమర్శిస్తున్నారు. ఒకవేళ చంద్రబాబు నాయుడుకి అవగాహన లేక పోలవరం ప్రాజెక్టుకి నష్టం కలిగించారని జగన్, అంబటి రాంబాబు భావిస్తున్నట్లయితే, వాటిని సరిదిద్ది పోలవరం ప్రాజెక్టుని పూర్తి చేసి ఉండాలి కదా?

చంద్రబాబు నాయుడుకి పోలవరం ప్రాజెక్టు పూర్తిచేయాలనే పట్టుదల, నిబద్దత ఉన్నందునే రివర్స్ టెండరింగ్ అనకుండా విదేశీ నిపుణులను రప్పించి ప్రాజెక్ట్ పరిస్థితిని అంచనా వేయిస్తున్నారు. జగన్‌ ప్రభుత్వం రాష్ట్రాన్ని అభివృద్ధి చేయకపోయినా ఎవరూ తప్పు పట్టి ఉండేవారు కారేమో?

కానీ అమరావతి, పోలవరం విషయంలో రాష్ట్రానికి చేసిన నష్టాన్ని ఎవరూ ఎన్నటికీ క్షమించలేరు. పోలవరం విషయంలో తమ అవగాహనా రాహిత్యాన్ని, బాధ్యతా రాహిత్యాన్ని, చేసిన తప్పులను హుందాగా అంగీకరించకపోగా మళ్ళీ చంద్రబాబు నాయుడు ప్రభుత్వంపై ఇదేవిదంగా విమర్శలు చేస్తుంటే, అప్పుడు ప్రజలే మళ్ళీ మరోమారు అంబటి రాంబాబుకి తగిన విదంగా బుద్ధి చెప్పవలసి ఉంటుంది.

ADVERTISEMENT
Latest Stories