సినీ పరిశ్రమలో శుక్రవారం అంటే అభిమానులకు పండగే. దర్శకులు, నిర్మాతలకు తెలియని ఓ టెన్షన్ ఉంటుంది. ప్రతి వారం మూడు నుంచి ఐదు సినిమాలు విడుదలవుతాయి. కొన్ని సందర్భాల్లో అంతకు మించి కూడా సినిమాలు విడుదలవుతుంటాయి. అయితే ఒకటి లేదా రెండు సినిమాలు మాత్రమే అందులో బాక్సాఫీస్ విజేతలుగా నిలుస్తాయి. ఈ గురు, శుక్రవారం (సెప్టెంబర్ 15.. సెప్టెంబర్ 16) విషయానికి వస్తే ఐదు సినిమాలు విడుదలవుతున్నాయి. అందులో మూడు స్ట్రయిట్ తెలుగు సినిమాలు. మిగిలిన రెండు సినిమాలు డబ్బింగ్ సినిమాలు. వీటిలో స్ట్రయిట్ తెలుగు సినిమాలను పరిశీలిస్తే..
మూడు తెలుగు సినిమాలు సెప్టెంబర్ 16న విడులవుతున్నాయి. మూడు సినిమాలు మూడు జోనర్స్ మూవీలనే చెప్పాలి. వాటిలో ముందుగా చెప్పుకోవాల్సిన సినిమా ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’. సుధీర్ బాబు, మోహన కృష్ణ ఇంద్రగంటి కాంబినేషన్లో రూపొందిన సినిమా ఇది. గతంలో వీరిద్దరి కాంబోలో వచ్చిన చిత్రం సమ్మోహనం సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. దీంతో ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ సినిమాపై తెలియని ఓ ఎక్స్పెక్టేషన్స్ వచ్చేశాయి. దీనికి తోడు ఇందులో యూత్ మెచ్చిన యంగ్ బ్యూటీ కృతి శెట్టి హీరోయిన్గా నటించటం కూడా ఓ ప్లస్ పాయింట్ అయ్యింది.
ఇక ప్రేక్షకులను అలరించటానికి ఈ వారం రానున్న మరో సినిమా ‘నేను మీకు బాగా కావాల్సిన వాడిని’. కిరణ్ అబ్బవరం హీరోగా నటించారు. సీనియర్ దివంగత దర్శకుడు కోడి రామకృష్ణ కుమార్తె దివ్య ఈ చిత్రాన్ని నిర్మించింది. ట్రైలర్ చూస్తుంటే ఇది ఫ్యామిలీ కమర్షియల్ ఎంటర్టైనర్ అని తెలుస్తుంది. కిరణ్ అబ్బవరంతో ఎస్.ఆర్.కళ్యాణ మండపం వంటి సక్సెస్ఫుల్ మూవీ చేసిన దర్శకుడు శ్రీధర్ గాదె ఈ సినిమాను డైరెక్ట్ చేశాడు. అలాగే కిరణ్ అబ్బవరంకు యూత్లో కాస్త కూస్తో ఇమేజ్ క్రియేట్ అయ్యింది. దీంతో సినిమా ఎలా ఉండబోతుందోనని ఆసక్తి అందరిలోనూ నెలకొంది.
ఇక మూడో సినిమా ‘శాకిని డాకిని’. థ్రిల్లర్ సినిమాలను తెరకెక్కించటంలో స్పెషలిస్ట్ అయిన సుదీర్ వర్మ ఈ సినిమా డైరెక్ట్ చేశారు. రెజీనా, నివేదా థామస్ వంటి గ్లామర్ డాల్స్ తొలిసారి ఓ యాక్షన్ స్టైల్ ఆఫ్ మూవీలో నటించారు. యాక్షన్ థ్రిల్లర్గా రూపొందిన ఈ చిత్రం హ్యుమన్ ట్రాఫికింగ్ అనే పాయింట్తో తెరకెక్కిందని క్లియర్గా అర్థమైంది. ఓ బేబీ వంటి నిర్మాతలు, సుధీర్ వర్మ వంటి డైరెక్టర్ కాంబోలో వస్తోన్న సినిమా కావటంతో.. ట్రైలర్ ఆసక్తికరంగా ఉండటంతో సినిమాపై ఇట్రెస్ట్ క్రియేట్ అయ్యింది.
మరి ఈ మూడు సినిమాలు దాదాపు ఒకే తీరులో ప్రేక్షకుల్లో అంచనాలను పెంచాయి. మరి ఈ మూడింటిలో బాక్సాఫీస్ విజేత ఎవరు అవుతారనేది తెలియటం లేదు. అయితే గత వారం ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన ఒకే ఒక జీవితం మంచి విజయాన్ని అందుకుంది. మరి ఈసారి అలాంటి విజయాన్ని ఏ సినిమా సొంతం చేసుకుంటుందో చూడాలి.
అయితే ఇక్కడ ప్రస్తావించాల్సిన విషయం ఏంటంటే.. ఇంతుకు ముందు చెప్పినట్లు రెండు తమిళ అనువాద చిత్రాలు లాఠీ, ముత్తు ఓ రోజు ముందే రిలీజ్ అవుతున్నాయి. లాఠీ సినిమాలో విశాల్ హీరో. తనకు మాస్ ఇమేజ్ ఉంది. సినిమా ఏమాత్రం కనెక్ట్ అయినా ప్రేక్షకులు సినిమా చూడటానికి ఆసక్తి చూపిస్తారు. అలాగే ముత్తు సినిమా విషయానికి వస్తే మన్మథుడు వంటి హిట్తో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన శింబు హీరోగా.. ఏ మాయ చేసావె వంటి సూపర్ డూపర్ సినిమాను చేసిన దర్శకుడు గౌతమ్ మీనన్ దర్శకత్వంలో రూపొందింది. ఈ రెండు చిత్రాల్లో కాన్సెప్ట్ బావుంటే ప్రేక్షకుడు కనెక్ట్ అవుతానడటంలో సందేహం లేదు. మరి ఈ వారం బాక్సాఫీస్ విజేత ఎవరు అవుతారనేది చూడాలంటే మరో రెండు రోజులు ఆగాల్సిందే..



