మూడేళ్ళ తర్వాత డైరెక్టుగా ముఖ్యమంత్రి కుర్చీలోకే!

Empty government chair symbolizing an absent political leader

పాండవులు అరణ్యవాసం, అజ్ఞాతవాసం పూర్తిచేసిన తర్వాత కూడా 5 ఊర్ల కొరకు యుద్ధం చేయాల్సివచ్చింది. కానీ అజ్ఞాతవాసం చేస్తున్న జగన్‌, కేసీఆర్‌లకు అటువంటి ఇబ్బంది లేదట. ఎన్నికలు జరగడమే ఆలస్యం ప్రజలు వారికి ముఖ్యమంత్రి కుర్చీ తెచ్చి అప్పగించేస్తారట!

కానీ వారి అజ్ఞాతవాసానికి కారణం వేరే ఉంది. అధికారంలో ఉన్నప్పుడు నా అంతటివాడు ఈ భూప్రపంచంలోనే లేడనుకున్నారు. వ్యవస్థలు కూడా వారికే దాసోహం అన్నాయి. కనుక ‘నా మాటే శాసనం’ అన్నట్లు వ్యవహరించారు.

ADVERTISEMENT

అధికారంలో ఉన్నప్పుడు తమ వంటి ముఖ్యమంత్రి, రాజకీయ నాయకుడు ‘నభూతో న భవిష్యతి’ అని మనస్పూర్తిగా నమ్ముతూ, పార్టీ శ్రేణుల చేత అలా చాటింపు వేయించుకున్నందునే. తమ గురించి అంత గొప్పగా ప్రచారం చేసుకున్నాక, ఓడిపోయి అధికారం కోల్పోతే ప్రజలకు మొహం చూపించగలరా? లేరు. కనుకనే ఒంటరిగా ఇంట్లో అజ్ఞాతవాసం చేస్తున్నారనుకోవచ్చు.

ముఖ్యంగా అహంభావం పాళ్ళు ఎక్కువున్న నేతలకు ఈ మనోవేదన ఇంకా తీవ్రంగా ఉంటుంది. కానీ రాజకీయాలలో గెలుపోటములను సమానంగా స్వీకరించే చంద్రబాబు నాయుడులాంటివారు చాలా త్వరగా తేరుకొని ప్రజల మధ్యకు వచ్చేస్తుంటారు.

జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికల ప్రచారంలో కేంద్ర మంత్రి బండి సంజయ్‌ ఓ ఆసక్తికరమైన ప్రశ్న అడిగారు. నిజానికి ఈ ప్రశ్న ఏపీ, తెలంగాణ రెండు రాష్ట్రాలలో అందరూ అడుగుతున్నదే.

“పదవి, అధికారం చేతిలో ఉంటేనే కేసీఆర్‌ ప్రజలకు కనిపిస్తారా?లేకుంటే ప్రజలను పట్టించుకోరా? అటువంటప్పుడు ప్రజలు కూడా మిమ్మల్ని పట్టించుకోవలసిన అవసరం ఏముంది? మూడేళ్ళ తర్వాత కేసీఆర్‌ మళ్ళీ రాజకీయాలలోకి వస్తారట! నేరుగా ముఖ్యమంత్రి అయిపోతారట!

కేటీఆర్‌ మాటలు చాలా హాస్యాస్పదంగా ఉన్నాయి,” అంటూ బండి సంజయ్‌ వారి కుటుంబంలో రాజకీయ ఆధిపత్యపోరు గురించి మాట్లాడారు. అవి అప్రస్తుతం.

కానీ ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచినప్పుడు తమకు ఓట్లు వేసి గెలిపించిన ప్రజల పట్ల బాధ్యత ఉండాలి కదా? శాసనసభకు రాకుండా లక్షలకు లక్షలు జీతాలు తీసుకుంటున్నారని అధికార పార్టీలు విమర్శిస్తున్నప్పుడైన మేల్కొని రావాలి కదా?

రాకూడదనుకుంటే ప్రభుత్వం ఇచ్చే ఈ జీతభత్యాలు మాకవసరం లేదని చెప్పేయవచ్చు కదా? కనీసం స్పందించాలి కదా? కానీ ఎంతగా విమర్శిస్తున్నా స్పందించకపోవడం సిగ్గుచేటు.

కానీ ఇప్పుడు చర్చ వారి జీతభత్యాల గురించి కాదు. వారు ఈవిదంగా ఇంట్లో కూర్చొని కాలక్షేపం చేస్తున్నా కూడా ప్రజలు మళ్ళీ తమకే పట్టం కడతారనే వారి నమ్మకమే ఆశ్చర్యం కలిగిస్తుంది. అంటే ప్రజల విజ్ఞతపై వారికి ఇంత చులకనభావం ఉందా? అనిపిస్తుంది.

లేకుంటే పార్టీ అధినేతలు రాజకీయాలకు, ప్రజలకు దూరంగా ఉంటూ తప్పకుండా మళ్ళీ ముఖ్యమంత్రి కాగలమని నమ్మకంగా ఎలా ఉన్నారు?

‘తెలంగాణలో రాజకీయ శూన్యత’ ఉందని కల్వకుంట్ల కవిత అన్నారు. అంటే రాజకీయాలలో కేసీఆర్‌ స్థానాన్ని మరొకరు భర్తీ చేయాల్సిన సమయం ఆసన్నమైందని చెపుతున్నట్లే కదా?

శాసనసభకి, ప్రజల మధ్యకి రాకపోయినా మూడేళ్ళ తర్వాత డైరెక్టుగా ముఖ్యమంత్రి అయిపోగలమనే గుడ్డి భ్రమలో ఉంటే అది వారిష్టం. కానీ వారినే నమ్ముకున్నవారు మాత్రం మరోసారి నిలువునా మునగడం తధ్యం.

ADVERTISEMENT
Latest Stories