గత ఎన్నికలలో నెల్లూరు జిల్లాలో వైసీపీ అన్ని సీట్లు గెలుచుకొని టిడిపి కంచుకోటను చేజిక్కించుకోగలిగింది. అయితే మళ్ళీ ఎన్నికలు దగ్గరపడే సమయానికి ఆ వైసీపీ కంచుకోట బీటలు వారిపోతుండటం చాలా ఆశ్చరకరం.
కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి తమ నియోజకవర్గాలలో ప్రభుత్వం అభివృద్ధి పనులకు రాష్ట్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేయడం లేదంటూ విమర్శిస్తుండటంతో జగన్ వారిపై సస్పెన్షన్ వేటు వేసి బయటకు పంపించేశారు. వారితో పాటు సీనియర్ నేత, జిల్లాలో పార్టీకి వెన్నెముకలా నిలిచిన మేకపాటి చంద్రశేఖర్ రెడ్డిని కూడా ఎమ్మెల్సీ ఎన్నికలలో క్రాస్ ఓటింగ్ చేశారనే సాకుతో బయటకు గెంటేశారు.
ఈవిదంగా నెల్లూరు వైసీపీ కంచుకోటకు పగుళ్ళు మొదలయ్యాయి. వారు బయటకు పంపిన తర్వాత జిల్లాలో వైసీపీ పరిస్థితి సర్దుకొంటుందనుకొంటే నెల్లూరు అర్బన్ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్, ఆయన బాబాయ్, నగర మేయర్ రూప్ కుమార్ యాదవ్ మద్య పంచాయితీ నడుస్తూనే ఉంది.
ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డికి నెల్లూరు రూరల్ నియోజకవర్గం బాధ్యత అప్పగించిన సంగతి తెలిసిందే. కానీ ఆయన కూడా ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్తో సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఇటీవల అయన, జిల్లాకే చెందిన వైసీపీ రాజ్యసభ సభ్యుడు వేంరెడ్డి ప్రభాకర్ రెడ్డితో సిఎం జగన్మోహన్ రెడ్డిని కలిసినప్పుడు, నెల్లూరు జిల్లా రాజకీయాలపై వారు లోతుగా చర్చించారు.
ఈ సందర్భంగా వేంరెడ్డి ప్రభాకర్ రెడ్డిని ఈసారి నెల్లూరు లోక్సభ స్థానానికి పోటీ చేయాలని జగన్ సూచించిన్నట్లు తెలుస్తోంది. కానీ నెల్లూరులో ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ కారణంగా పార్టీ ఇమేజ్ చాలా దెబ్బతిందని, పార్టీ పట్ల ప్రజలలో తీవ్ర అసంతృప్తి నెలకొని ఉందని కుండబద్దలు కొట్టేశారు. అక్కడి నుంచి లోక్సభకు పోటీ చేయడం చాలా రిస్క్ కనుక తాను పోటీ చేయలేనని జగన్కు చెప్పిన్నట్లు తెలుస్తోంది.
అనిల్ కుమార్ యాదవ్కు సొంత బాబాయ్తోనే కాదు… జిల్లాకు చెందిన మంత్రి కాకణి గోవర్ధన్ రెడ్డితో కూడా పొసగడం లేదు. మంత్రి కాకని అధికారిక కార్యక్రమాలకు అనిల్ని ఆహ్వానించరు. ఒకవేళ పిలిచినా అనిల్ వెళ్ళరు.
తన మంత్రి పదవికి కాకనే ఎసరు పెట్టి కొట్టేశారని అనిల్ కుమార్ యాదవ్ భావిస్తుండటమే ఇందుకు కారణం. నెల్లూరు జిల్లా వైసీపీపైకి ఇంకా బలంగానే కనబడుతున్నప్పటికీ, లోలోపల జరుగుతున్న ఈ కుమ్ములాటలు చెదలు పట్టిన్నట్లు పార్టీని తినేస్తున్నాయి.



