మొన్న గురుపూజోత్సవం సందర్భంగా ఒంగోలులో జరిగిన కార్యక్రమంలో ఏపీ పురపాలకశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, “గురువుల కన్న గూగుల్ మిన్న,” అంటూ వేదికపై ఉపాధ్యాయుల సమక్షంలోనే చేసిన వ్యాఖ్యలపై రాష్ట్రంలో ఉపాధ్యాయులు అందరూ తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. దీంతో మంత్రి సురేష్ హడావుడిగా మీడియా సమావేశం ఏర్పాటు చేసి, “నేను అలా అనలేదు. మీడియా నా మాటలను వక్రీకరించిందని” చెప్పారు.
“నా తల్లితండ్రులు ఇద్దరూ ఉపాధ్యాయులే. నేను కూడా ఉపాధ్యాయుడు కావాలనుకొన్నాను. కనుక నాకు ఉపాధ్యాయులంటే చాలా గౌరవం ఉంది. గతంలో నేను విద్యాశాఖ మంత్రిగా చేసినప్పుడు ఉపాధ్యాయ సంఘాలతో మంచి అనుబందం ఉండేది నాకు. కనుక నేను గురువులను అవమానిస్తూ వారి కంటే ‘గూగుల్ మిన్న’ అని ఎందుకు అంటాను.
జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి విద్యావ్యవస్థకు, గురువులకు ఎంత ప్రాధాన్యం ఇస్తునారో అందరూ చూస్తూనే ఉన్నారు. బైజూస్ టెక్నాలజీతో ఇప్పుడు అంతా ట్యాబ్స్ లోకే వచ్చేస్తోంది. గురువులకు తెలీనివి కూడా గూగుల్ చెప్పేస్తోంది కనుక గురువులు కూడా ఎప్పటికప్పుడు అందివచ్చే ఆర్టిఫిషియల్ ఇంటలిజన్స్ వంటి టెక్నాలజీ గురించి తెలుసుకొని వినియోగించుకోవాలని చెప్పడమే నా ఉద్దేశ్యం తప్ప వారిని అవమానించాలని కాదు. కానీ నా మాటలను మీడియా వక్రీకరించి నేను గురువులను అవమానించిన్నట్లు వ్రాశాయి,” అని మంత్రి చెప్పుకొన్నారు.
‘గురువుల కన్న గూగుల్ మిన్న’ అని తాను అనలేదని మంత్రి సురేష్ చెప్పుకొచ్చారే తప్ప తన మాటలతో ఉపాధ్యాయులు నొచ్చుకొని ఉంటే క్షమించమని కోరనేలేదు.
టెక్నాలజీని అందిపుచ్చుకొనే విషయంలో ఉపాధ్యాయులు వెనకబడి ఉన్నారన్నట్లు మంత్రి సురేష్ అభిప్రాయంగా కనిపిస్తోంది. అది నిజమే అయ్యుండవచ్చు. ఎందుకంటే రాష్ట్రంలో ఉపాధ్యాయులకు స్కూల్లో పాఠాలు చెప్పడంతో వారి డ్యూటీ ముగిసిపోదు. ఇళ్లకు చేరుకొన్న తర్వాత కూడా రాత్రి నిద్రపోయేవరకు కూడా విద్యార్థుల హోంవర్క్ చూడాలి. మర్నాడు చెప్పాల్సిన పాఠాల గురించి ప్రిపేర్ అవ్వాలి. పరీక్షా పత్రాలు దిద్దాలి. ఈ వివరాలన్నీ ప్రతీరోజూ అర్దరాత్రి వరకు ఆన్లైన్లో అప్లోడ్ చేస్తుండటం వంటి చాలా పనులుచేయక తప్పడం లేదు.
మళ్ళీ ఉదయం లేవగానే ఉరుకుల పరుగుల మీద పాఠశాలలకు చేరుకోవాలి. క్షణం ఆలస్యమైనా ఆబ్సెంట్ పడిపోతుంది. పాఠశాలలో అడుగుపెట్టగానే విద్యార్థుల అటెండన్స్ తీసి ఆన్లైన్ అప్లోడ్ చేయాలి. తర్వాత మరుగుదొడ్లు ఫోటోలు తీసి అప్లోడ్ చేయాలి. తర్వాత విద్యార్థుల బ్రేక్ ఫాస్ట్, మధ్యాహ్నం భోజనం ఏర్పాట్లను ఉపాధ్యాయులే చూసుకోవాలి. ఇవన్నీ క్షణం ఆలస్యం చేయకుండా చేస్తూనే ఉండాలి లేకుంటే వాట్సప్లోనే మెమోలు వచ్చేస్తాయి!మరి పిల్లలకు పాఠాలు చెప్పేదెప్పుడు?అసలు ఉపాధ్యాయులకు కుటుంబాలతో గడిపేందుకు సమయమే ఉండటం లేదు. ఇక కొత్త టెక్నాలజీ గురించి ఎలా తెలుసుకోగలుగుతారు?
మంత్రి సురేష్ నిన్న ఆర్టిఫిషియల్ ఇంటలిజన్స్ ప్రస్తావన చేయడం గమనార్హం. అంటే ఏదో ఓ రోజు వైసీపీ ప్రభుత్వం రాష్ట్రంలో ఉపాధ్యాయులందరినీ ఉద్యోగాలలో నుంచి తొలగించేసి, ఆర్టిఫిషియల్ ఇంటలిజన్స్ టెక్నాలజీతో పిల్లలకు పాఠాలు చెప్పించే ఆలోచన చేస్తోందేమో?అనే అనుమానం కలుగుతోంది.
ఒకవేళ పిల్లలకు పాఠాలు చెప్పేందుకు ఆర్టిఫిషియల్ ఇంటలిజన్స్ సరిపోతుందనుకొంటే, ప్రభుత్వం నడిపించేందుకు కూడా అదే ఉపయోగిస్తే మంచిది కదా? ఇక ఈ ఎన్నికలు, రాజకీయ పార్టీలు, నాయకులు, కుట్రలు, కక్షలు ఉండవు కదా?



