ఇటీవల ప్రకటించిన 2013 ఏపీ నంది అవార్డుల్లో ‘అలియాస్ జానకి’ అనే చిత్రానికి దర్శకత్వం వహించిన దయా కొడవటిగంటి ఉత్తమ దర్శకుడి పురస్కారం గెలుచుకున్న సంగతి తెలిసిందే. దీంతో సంతోషంతో తన అనుభూతులను పంచుకున్న దయా… వాస్తవానికి తాను సినీ రంగంలో నటుడిగా ఉండాలని అనుకున్నానని చెప్పారు. అయితే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇచ్చిన సలహాతో డైరెక్టర్ గా మారిపోయానని అన్నారు.
గతంలో పవన్ నటించిన ‘ఖుషి’ సినిమాకు అప్రెంటీస్ గా ఉన్న దయా, తర్వాత పవన్ నటించిన ‘జానీ’ సినిమా నుంచి ‘పంజా’ వరకు అన్ని సినిమాల్లోనూ కనిపించారు. ఆ సమయంలోనే మంచి నటుడిని కావాలని ఉందని పవన్ కల్యాణ్ తో తాను చెప్పానని, అయితే, ముందుగా సినిమాకు సంబంధించిన అన్ని విభాగాల మీద అవగాహన పెంచుకోమని పవన్ సలహా ఇచ్చారని దయా కొడవటిగంటి చెప్పారు.
సినిమాల్లో తనకు వేషాలు ఇప్పించిన పవన్తో కలిసి పనిచేస్తున్నప్పుడు పవన్ దగ్గర దర్శకత్వ మెలకువలు నేర్చుకున్నానని అన్నారు. ఈ నేపథ్యంలో ప్రయత్నాలు మొదలుపెట్టిన తనకు ‘అలియాస్ జానకి’ సినిమా అవకాశం దొరికిందని పేర్కొన్నారు. తనకు వచ్చిన నంది అవార్డును పవన్ కళ్యాణ్ కు అంకితమిస్తున్నానని సంతోషంగా చెప్పారు.



