2018, ఏప్రిల్ 27వ తేదీ… ప్రిన్స్ మహేష్ బాబు మరియు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ల సినిమాలు ఒకే రోజు విడుదల కానున్నాయన్న వార్త హాట్ టాపిక్ గా మారిన వైనం తెలిసిందే. అయితే ఈ సమయం వచ్చేపాటికి రెండు సినిమాలు బరిలో ఉంటాయా? లేక ఏదైనా మూవీ వెనక్కి తగ్గుతుందో అన్నది ఇప్పుడే చెప్పలేం గానీ, మహేష్ తో అమీతుమీ తేల్చుకుని మరో మెట్టు ఎదగాలని అల్లు అర్జున్ ఊవ్విళ్ళూరుతున్నట్లుగా కనపడుతోంది. అయితే తేడా వస్తే అదే స్థాయిలో విమర్శలు కూడా వచ్చే అవకాశం ఉంది.
అన్నీ అనుకున్నట్లుగా రెండు సినిమాలు ఒకే రోజు విడుదలైతే… ప్రిన్స్, స్టైలిష్ స్టార్ అభిమానుల హంగామాతో పాటు పవర్ స్టార్ ఫ్యాన్స్ కూడా కీలకం కాబోతున్నారు. ‘చెప్పను బ్రదర్’ అన్న డైలాగ్ నుండి అల్లు అర్జున్ ను పవన్ ఫ్యాన్స్ టార్గెట్ చేసిన వైనం బహిరంగమే. దీని పర్యవసానాలే బన్నీ “దువ్వాడ జగన్నాధమ్” సినిమా టీజర్ మోస్ట్ డిస్ లైక్డ్ టీజర్ గా నిలవడంతో పాటు, ఆ సినిమా ఫలితంపై కూడా ప్రభావం చూపింది. దీంతో మరోసారి బన్నీ మూవీ రిలీజ్ అవుతోంది అంటే… పవన్ ఫ్యాన్స్ పాత్ర కీలకం అన్నది తధ్యం.
ఒకే రోజు విడుదల అవుతున్నాయి కాబట్టి, పవన్ ఫ్యాన్స్ మళ్ళీ బన్నీ మూవీని ఏ మాత్రం టార్గెట్ చేసినా… పరోక్షంగా ప్రిన్స్ మూవీకి సహకారం అందించడమే అవుతుంది. ప్రస్తుతమున్న వాతావరణంలో మహేష్, అల్లు అర్జున్ లలో పవన్ అభిమానులు ప్రిన్స్ వైపుకే మొగ్గుచూపే అవకాశాలున్నాయి. దీంతో ‘నా పేరు సూర్య’ సినిమా విడుదల సమయం వచ్చేపాటికి పవన్ ఫ్యాన్స్ పట్ల బన్నీ తన ‘స్వరం’లో సవరణలు చేసే అవకాశాలు స్పష్టంగా కనపడుతున్నాయని టాలీవుడ్ ట్రేడ్ వర్గాలు చెప్పుకుంటున్నాయి.


