అమరావతి శంకుస్థాపన అప్పుడు ప్రధాని నరేంద్ర మోడీ పర్యటన తరువాత అమరావతికి ప్రముఖులు వచ్చిన దాఖలాలు లేవు. చాలా రోజులు తరువాత ప్రథమ పౌరుడు, రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఈ నెల 27వ తేదీన రాజధాని ప్రాంతంలో పర్యటించనున్నారు. తొలిసారి ఆయన ఇక్కడకు వస్తున్న నేపథ్యంలో అధికారులు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు.
రాష్ట్ర ప్రభుత్వానికి అత్యంత ప్రతిష్ఠమకమైన ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్టును ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో కలిసి ప్రారంభిస్తారు. అనంతరం ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. సచివాలయంలో ఏర్పాటు చేసిన రియల్ టైమ్ గవర్నెన్స్ను పరిశీలిస్తారు. ఆ తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఇచ్చే విందులో పాల్గొంటారు.
రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో పోలీసు ఉన్నతాధికారులు భారీ బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రకాశం, నెల్లూరు నుంచి నలుగురు ఎస్పీలు, అయిదుగురు ఏఎస్పీలు, 20మంది డీఎస్పీలు, 40 మంది సీఐలు, 80 మంది ఎస్ఐలు, 800 మంది కానిస్టేబుళ్లను రప్పిస్తున్నారు. మొత్తం పోలీసు డిపార్ట్మెంట్ అంతా అప్రమత్తంగా ఉంది.
గతంలో అమరావతి పరిసరప్రాంతాలలో మావోయిస్టు ప్రాబల్యం అధికంగా ఉండేది. దీనితో మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇప్పటికే శీతాకాలం విడిది కోసం రాష్ట్రపతి హైదరాబాద్ చేరుకున్నారు. ప్రథమ పౌరుడు తొలిసారిగా రావడంతో చుట్టుపక్కల ఊర్లు అన్ని కోలాహలంగా ఉన్నాయి.



