జగన్ హయంలో 5 ఏళ్ళపాటు నిర్లక్ష్యానికి గురైన రాజధాని అమరావతిలో ఇప్పుడు నిర్మాణ పనులు చకచకా సాగుతున్నాయి. కనుక రాష్ట్ర ప్రజలు అమరావతిలో జరుగుతున్న నిర్మాణాల గురించి తెలుసుకోవాలని కోరుకోవడం సహజం.
ముందుగా అమరావతిలో సీఆర్డీయే కార్యాలయం నిర్మాణం అతి త్వరలో పూర్తి కాబోతోంది. ప్రస్తుతం అమరావతిలో ప్రధాన రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పనులు, మంత్రులు, ఎమ్మెల్యేలు, వివిధ శాఖల ముఖ్య కార్యదర్శులు, హైకోర్టు న్యాయమూర్తులు, ఆల్ ఇండియా సర్వీస్ అధికారుల బంగళాలు, క్వార్టర్స్ నిర్మాణ పనులు చురుకుగా జరుగుతున్నాయి.
కొన్ని భవనాలలో 80-90 శాతం వరకు పనులు పూర్తయ్యాయి. మూడేళ్ళలో అమరావతి నిర్మాణ పనులు పూర్తిచేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకునందున రేయింబవళ్ళు నిర్మాణ పనులు జరుగుతున్నాయి.
ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఐఏఎస్, ఐపీఎస్, ఆల్ ఇండియా సర్వీస్ అధికారుల కోసం 12 టవర్లలో 1,632 ఫ్లాట్స్ నిర్మిస్తున్నారు.
వివిధ శాఖల ముఖ్య కార్యదర్శుల కోసం 25 బంగళాలు, కార్యదర్శుల కోసం 90, మంత్రుల కోసం 35, హైకోర్టు న్యాయమూర్తుల కోసం 36 బంగళాలు నిర్మిస్తున్నారు.
గెజిటెడ్ ఆఫీసర్ల కొరకు 4 టవర్లలో 384 ఫ్లాట్స్, నాన్ గెజిటెడ్ ఆఫీసర్ల కోసం 21 టవర్లలో 1,968 ఫ్లాట్స్, టైప్-2 అధికారులకు 4 టవర్లలో 336 ఫ్లాట్స్, గ్రూప్-4 ఉద్యోగులకు 6 టవర్లలో 720 ఫ్లాట్స్ నిర్మిస్తున్నారు.
ఈ ఏడాది డిసెంబర్ నాటికి ఈ క్వార్టర్స్ నిర్మాణ పనులు పూర్తవుతాయి. అమరావతిలో వివిధ నిర్మాణ కాంట్రాక్టులు దక్కించుకున్నసంస్థలన్నీ ఈ ఏడాది డిసెంబర్ నాటికి నూటికి నూరుశాతం తమకు కేటాయించిన పనులు మొదలుపెడతాయి.




