శ్రీరాముడు సీతాదేవిని రక్షించేందుకుగాను లంకను చేరడానికి వానర సేన దండుగా కదిలి సముద్రం మీద రామసేతు నిర్మించింది. అయితే ఆ నిర్మాణం మాకు సాధ్యమా.? అసలు రాముడు సీతా దేవి కోసం లంకను చేరడం అవసరమా అంటూ యక్ష ప్రశ్నలు వేస్తూ వానరసేన తమ సమయాన్ని వృధా చేస్తేనో.?
అది మాకు సాధ్యం కాదని తమ మనోధైర్యాన్ని కోల్పోతేనో రామసేతు నిర్మాణం జరిగేనా.? లంకలో సీతాదేవి చెర వీడేనా.? రావణ వద అయ్యేనా.? సీతారాముల కోసం ఏదైనా చెయ్యాలి అనే చిత్తశుద్ధి, చేస్తాము అనే నమ్మకమే రామసేతు నిర్మాణానికి నాంది. అయితే ఆ నిర్మాణంలో తన వంతు పాత్ర అంటూ ఉడత చేసిన సాయం కూడా చరిత్ర ఎప్పటికి మరచిపోలేదు, మరచిపోదు కూడా.
అలాగే ఇక్కడ 7 కోట్ల ఆంధ్రుల ఆత్మగౌరవం, గుర్తింపు కోసం సీఎం చంద్రబాబు నాయుడు సైతం అమరావతి నిర్మాణం నాకు సాధ్యమా.? నా పార్టీకి అవసరమా.? అంటూ ముందడుగు వేయకపోతే అమరావతికి పునాది పడేనా.? 7 కోట్ల ప్రజలకు రాజధాని కల తీరేనా.?
అయితే ఆ పునాది వెనుక వేలమంది రైతుల త్యాగం ఉంది, లక్షల మంది కష్టం ఉంది, అలాగే కోట్ల మంది భవిష్యత్ ఉంది. వీటన్నింటి ని పక్కన పెట్టి వైసీపీ అసలు అమరావతి నిర్మాణం సాధ్యమేనా.? ఎన్నాళ్ళ సమయం పడుతుంది.? ఎన్ని వేలకోట్ల ఖర్చు చేస్తుంది.? ఏపీకి రాజధాని అవసరమా.?
ఇది అమరావతి కాదు భ్రమరావతి, ఈ నిర్మాణాలు పూర్తి కావడం అసాధ్యం, ఇవన్నీ గ్రాఫిక్స్ మాయాజాలం అంటూ వైసీపీ చేస్తున్న విష ప్రచారాలు అమరావతి నిర్మాణానికి అడ్డంకులుగా మారుతున్నాయి. వీటికి తోడు రాష్ట్ర రాజధానిగా అమరావతే ఎందుకు.? వై మూడు రాజధానులు.? వై విశాఖ.? అంటూ గత ఐదేళ్ల వైసీపీ పాలనలో అమరావతి నిర్మాణాలను సమాధి చేసారు.
ఇక తాజాగా మావిగన్ అంటూ మూడు నగరాల పేర్లతో జగన్ మరో వాదనను తెరమీదకు తెచ్చారు. ఇక ఈ వాదనను సమర్ధించేందుకు వరుసగా వైసీపీ దండు మీడియా ముందుకొస్తుంది. ఇందులో భాగంగా మాజీ మంత్రులు అంబటి రాంబాబు, రజని జగన్ మావిగన్ మాత్రమే ఏపీ భవిష్యత్ అంటూ మూడు రాజధానుల నుండి మావిగన్ కు షిఫ్ట్ అయ్యారు.
వైసీపీ ఎంపీ మార్గాన్ని భరత్ బయటకొచ్చారు. అమరావతి నిర్మాణానికి వెచ్చించే లక్షల కోట్ల వ్యయంలో కేవలం 10 వేల కోట్లు ఖర్చు చేస్తే మావిగన్ ఇట్టే అభివృద్ధి చెందుతుంది అంటూ అమరావతి నిర్మాణాలకు తమ వంతు అడ్డుపుల్లలు వేస్తున్నారు. మావిగన్ మీద ఇంత స్థాయి అవగాహన ఉన్న వైసీపీ నేతలు తమ ఐదేళ్ల హయాంలో మూడు రాజధానులు అంటూ ఎందుకు కాలక్షేపం చేసారో చెప్పగలరా.?
లేదా విశాఖే రాజధాని అంటూ ఎందుకు ప్రచారం చేసుకున్నారో వివరించగలరా.? మొన్న అమరావతికి సమ్మతమే అన్నారు, నిన్న మూడు రాజధానులు అన్నారు, అటు పై విశాఖే రాజధాని అన్నారు, ఇక ఇప్పుడు తాజగా మావిగన్ అంటున్నారు. ఇక్కడితో అయినా వైస్ జగన్ కు రాజధాని దాహం తీరుతుందా.? లేదా రేపటి రోజున మావిగన్ స్థానంలో మరొక పేరు వస్తుందా.?
ఒక నిర్మాణానికి పునాది వేసిన తరువాత దాన్ని ఎలా అయినా పూర్తి చెయ్యాలని అనే చిత్తశుద్ధి ఉండాలి, చెయ్యగలము అనే నమ్మకం ఉండాలి, ప్రజలకిచ్చిన మాట నిలబెట్టుకోవాలి అనే తపన కలగాలి, అంతేకాని సాధ్యమా.? అవసరమా.? అంటూ జవాబులు లేని ప్రశ్నలు వేస్తూ నిర్మాణాలను కూలుస్తు, మారుస్తూ పొతే అసలు భవిష్యత్ లో కొత్త నగరాల నిర్మాణాలకు ఆస్కారం ఉంటుందా.?




