రాజధాని ప్రాంతాలలో రైతులు తమ జీవనోపాధి వ్యవసాయ భూములను రాష్ట్రం కోసం, అమరావతి రాజధాని కోసం ఇచ్చారు. కనుక రాష్ట్ర ప్రజలందరూ వారికి చెయ్యెత్తి దణ్ణం పెట్టాల్సిందే.
అలాంటివారిని కూడా జగన్ ప్రభుత్వం చాలా దారుణంగా అవమానించింది. కేసులు పెట్టి వేదించింది. వైసీపీ మూకలతో వారిపై దాడులు చేయించింది.
ఇన్ని అవమానాలు, కష్టాలు భరించిన వారందరూ తాము కోరుకున్న ‘మంచి ప్రభుత్వం’ అధికారంలోకి వచ్చిందని, ఇక తమ కష్టాలన్నీ తీరిపోతాయనే అనుకున్నారు. అలాగని ప్రభుత్వమే తమ ఇంటికి వచ్చి సమస్యలు తీర్చేయాలని అత్యాశకు పోలేదు.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వారు సీఆర్డీఏ కార్యాలయం వద్ద పడిగాపులు కాస్తూనే ఉన్నారు. కానీ నేటికీ వారి గోడు పట్టించుకునే నాధుడే లేడు!
ల్యాండ్ పూలింగ్ ద్వారా వారికి ప్రభుత్వం ఇస్తానన్న భూములు ఇవ్వనే లేదు. ఈ విషయం వైసీపీ నాయకులో వారి సొంత మీడియా చెపితే నమ్మలేము. కానీ అమరావతి కోసం 25 ఎకరాలు ఇచ్చిన యుగంధర్ అనే రైతు మీడియా ముందుకు వచ్చి తమ గోడు మొరపెట్టుకున్నారు.
తాను ఇచ్చిన 25 ఎకరాలకు బదులుగా ప్రభుత్వం 30,000 గజాలు ఇవ్వాల్సి ఉంది. కానీ దానిలో 15,000 గజాలు మాత్రమే ఇచ్చింది. మిగిలిన 15,000 గజాలలో మరికొంత ఇచ్చి రిజిస్ట్రేషన్ కూడా చేసింది. కానీ అతనికి కేటాయించిన ఆ భూమిని దాని యజమాని (రైతు) ప్రభుత్వానికి ఈయనే లేదు. నేటికీ అది అతని పేరు మీదే ఉంది. దానిని ల్యాండ్ పూలింగ్లో సమీకరించకుండానే, ఆ రైతు భూమిని యుగంధర్ పేరిట రిజిస్ట్రేషన్ చేసేశారు అప్పటి సీఆర్డీఏ అధికారులు!
ఆ తర్వాత జగన్ 5 ఏళ్ళ పాలనలో సీఆర్డీఏ అధికారులు చేతులెత్తేశారు. ఈ కష్టాలు సరిపోవన్నట్లు జగన్ ప్రభుత్వం మిగిలిన రైతులతో పాటు యుగంధర్పై కూడా అరడజనుపైగా కేసులు కూడా నమోదు చేయించింది! రాజధాని నిర్మాణం కోసం భూములు ఇస్తే రైతులకు లభించిన గౌరవం ఇదీ!
సరే ఇప్పుడు మన ప్రభుత్వం… ‘మంచి ప్రభుత్వం’ అధికారంలోకి వచ్చింది కదా అని యుగంధర్తో అమరావతిలో రైతులు సంతోషపడ్డారు. కానీ ఏడాదిన్నరగా సీఆర్డీఏ కార్యాలయం చుట్టూ కాళ్ళు అరిగిపోయేలా తిరుగుతూనే ఉన్నారు. వారి సమస్యలు తక్షణం పరిష్కరించాలని మంత్రి నారాయణ ఎప్పటికప్పుడు సీఆర్డీఏ అధికారులకు గట్టిగా నొక్కి చెపుతూనే ఉన్నారు.
కానీ సీఆర్డీఏ కమీషనర్ కన్నబాబు మాత్రం పట్టించుకోవడం లేదు. ముఖ్యమంత్రి, కేంద్ర మంత్రి కార్యాలయం నుంచి వచ్చిన ఫోన్లకే దిక్కులేదు… మీరెంత? అన్నట్లు కమీషనర్ కన్నబాబు వ్యవహరిస్తున్నారని యుగంధర్ ఆరోపించారు.
అమరావతికి భూములు ఇచ్చిన రైతులను జగన్ ప్రభుత్వం అవమానించింది. కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం చేస్తున్నదేమిటి?
సిఎం చంద్రబాబు నాయుడుపై నమ్మకం, గౌరవంతో నాడు రైతులు తమ భూములిస్తే, వారి పట్ల అధికారులు కూడా ఇలాగేనా వ్యవహరించేది?వారితో ఈవిదంగా వ్యవహరిస్తుంటే, అమరావతి విమానాశ్రయం వగైరా నిర్మాణాలకు మరో 30,000 ఎకరాలు ఇమ్మంటే రైతులు ఇస్తారా? ఇవ్వకపోతే ఎవరిని నిందించాలి? రైతులనా సీఆర్డీఏ కమీషనర్, అధికారులనా?
కూటమి ప్రభుత్వం అదృష్టం కొద్దీ ఈ వ్యవహరంలో జగన్ వేలుపెట్టడం లేదు. ఒకవేళ శాసనసభ సమావేశాలకు హాజరై ఇదే అంశంపై ప్రభుత్వాన్ని నిలదీసి ప్రశ్నిస్తే? లేదా వారి తరపున కోర్టులో పిటిషన్స్ వేయిస్తే? పోయేది కూటమి ప్రభుత్వం పరువే కదా?
కనుక ‘ఇది మంచి ప్రభుత్వం’ సెల్ఫ్ సర్టిఫై చేసుకుంటే సరిపోదు. రాజధాని కోసం భూములిచ్చిన యుగంధర్ వంటి రైతులకు వెంటనే న్యాయం చేసి వారి చేత ‘ఇది మంచి ప్రభుత్వం’ అనిపించుకుంటేనే గౌరవం!





