రాష్ట్ర రాజధానిగా అమరావతికి కేంద్రం నుంచి చట్టబద్దత లభించిన తరుణంలో రాష్ట్ర వ్యాప్తంగా అమరావతి
చట్టబద్దత మీద జరగాల్సిన చర్చను వైసీపీ అధినేత వైస్ జగన్ మోహన్ రెడ్డి తెలివిగా తన మావిగన్ ప్రకటనతో అటు వైపు మళ్లించరా.? అంటే అవుననే వాదనే వినిపిస్తుంది.
రాష్ట్ర విభజన జరిగిన పుష్కర కాలానికి, రాష్ట్ర రాజధాని గా అమరావతి ని ప్రకటించిన దశాబ్దానికి రాజధానిగా అమరావతి కి కేంద్రం పార్లమెంట్ సాక్షిగా చట్టబద్దత లభించింది. దీనితో రాజధానిగా అమరావతికి ఒక నిజమైన గుర్తింపు గౌరవం లభించినట్టయ్యింది.
అలాగే ఈ చట్టబద్ధతతో రాజధానికి భూములిచ్చిన రైతులకు ప్రభుత్వం నుంచి ఒక బలమైన భరోసా అందినట్టయ్యింది.
దానికి తోడు రాజధాని ప్రాంతంలో పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి చూపే పారిశ్రామిక వేత్తలకు ఒక నమ్మకం ఏర్పడింది. భవిష్యత్ లో వైసీపీ అధికారంలోకి వస్తే అన్న భయానికి, ఆలోచనకు ఈ చట్టబద్దత ఒక ధైర్యం లా నిలబడింది.
అమరావతి రైతుల త్యాగ ఫలం, బాబు నాయకత్వ పోరాట పటిమ కలిపి 7 కోట్ల ఆంధ్రులకు రాజధానిగా ఒక అడ్రెస్స్ లభించింది. ఆంధ్రప్రదేశ్ భవిష్యత్ కి ఇంతటి భరోసా ఇచ్చే అమరావతి బిల్లు పై మీడియాలో చర్చ జరగకుండా, చట్టబద్ధత వలన రాష్ట్రానికి, అమరావతి కలిగే మేలు ప్రజలకు తెలియకుండా జగన్ మావిగన్ ప్రకటన ఒక కవచంలా అడ్డుపడిందనే చెప్పాలి.
జగన్ వ్యూహాత్మకంగానే అమరావతి చట్టబద్ధత మీద మీడియాలో చర్చ జరగకుండా, కథనాలు ప్రచారం కాకుండా, ప్రజల మధ్య అమరావతి టాపిక్ రాకుండా ఉండేందుకే రాజధానిగా మావిగన్ అంటూ ప్రకటించి మీడియా అటెన్షన్ మొత్తాన్ని అమరావతి నుంచి మావిగన్ వైపు మళ్లించారు.
అలాగే ఆ అటెన్షన్ ను ఇంకొన్ని రోజుల పాటు కొనసాగించేలా తన వైసీపీ సేనను మీడియా ముందుకు పంపిస్తున్నారు. వారు కూడా తమ అధినేత ఆదేశాలను శిరసా వహిస్తూ ఆంధ్రప్రదేశ్ రాజధానిని అపహాస్యం చేసేందుకు, తమ రాజకీయ భవిష్యత్ ని సమాధి చేసుకునేందుకు ఉత్సాహం చూపిస్తున్నారు.
ఇలా జగన్ మొత్తానికి మావిగన్ తో ఇటు మెయిన్ స్ట్రీమ్ మీడియాను అటు సోషల్ మీడియాను కబ్జా చేశారనే చెప్పాలి. అమరావతి విజయం గురించి చర్చించాల్సిన సమయంలో అసలు అమలు సాధ్యం కానీ మావిగన్ గురించి డిబేట్లు జరుగుతున్నాయి. అమరావతి పై ప్రభుత్వ చిత్తశుద్ధి గురించి ప్రశంసించాల్సిన సందర్భంలో అసలు ప్రతిపక్ష హోదా కూడా లేని వైసీపీ చేస్తున్న వింత ప్రకటనల గురించి చర్చలు సాగుతున్నాయి. మరి ఇక్కడ వైసీపీ నెగ్గినట్టా.? కూటమి గెలిచినట్టా.?




