అమరావతిని ఏపీ రాజధానిగా ఖరారు చేస్తూ కేంద్ర ప్రభుత్వం నేడు లోక్సభలో బిల్లు ప్రవేశపెడుతోంది. దానిని ఆమోదించి రేపు రాజ్యసభ ఆమోదముద్ర వేస్తుంది.
ఇదే సమయంలో అమరావతి విషయంలో సిఎం చంద్రబాబు నాయుడు చాలా తప్పులు, అవినీతికి పాల్పడుతున్నారంటూ వైసీపీ నేతలు ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. వారి తీర్మానానికి నేడు జగన్ తాడేపల్లి ప్యాలస్ ప్రెస్మీట్లో ఆమోదముద్ర వేస్తారు.
అమరావతి వ్యవహారం పార్లమెంటుకి వెళ్తే జగన్ ఏం చేస్తారు? అనుకునేవారు రాజకీయ అమాయకులే. అక్కడ సిఎం చంద్రబాబు నాయుడు శాసనసభలో తీర్మానం పెట్టి పార్లమెంటుకి పంపేందుకు సన్నాహాలు చేస్తుంటే, జగన్ కూడా చకా చకా పావులు కదుపుతూనే ఉన్నారు.
ఓ పక్క సొంత మీడియా, సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేయిస్తూనే, వైసీపీ నేతలను హడావుడిగా ‘చలోమూలపేట పోర్టు’ పేరుతో శ్రీకాకుళంలో సభ ఏర్పాటు చేయించారు. పోర్టు నిర్మాణంలో భూములు కోల్పోతున్న రైతులు ఎక్కువగా ఉండే నౌపాడలో సభ నిర్వహించడం కూడా వైసీపీ వ్యూహంలో భాగమే.
ఆ వేదిక నుంచి ‘అమరావతి పేరుతో చంద్రబాబు నాయుడు రైతుల భూములు గుంజుకొని వారికి అన్యాయం చేస్తున్నారని, అవినీతికి పాల్పడుతున్నారని వైసీపీ నేతలు ఒకే మాటగా చెప్పడం కూడా జగన్ వ్యూహంలో భాగమే అని భావించవచ్చు. నేడు తాడేపల్లి ప్యాలస్ ప్రెస్మీట్లో కూడా జగన్ కూడా ఇదే చెప్పారు.
కనుక అక్కడ లోక్సభలో, ఇక్కడ తాడేపల్లి ప్యాలస్లో అమరావతిపై ఒకే సమయంలో చర్చ జరిగేలా జగన్ చాలా చక్కగా ప్లాన్ చేశారని చెప్పవచ్చు.
ఇంత దూరదృష్టి, రాజకీయ చతురత, ప్రిసైజ్ ప్లానింగ్ అమరావతి నిర్మాణ విషయంలో చూపి ఉండి ఉంటే?అవినీతి రహితంగా, పారదర్శకంగా అమరావతి నిర్మించి ఉండి ఉంటే? ఆ క్రెడిట్ ఆయనకే దక్కేది. నేడు జగన్మోహన్ రెడ్డే ముఖ్యమంత్రిగా ఉండేవారు కదా?




