అమరావతికి దూరంగా ఉండటమే వైసీపీకి సేఫ్!

Amaravati Row: Jagan’s Moves May Cost YSRCP Again

ప్రజలు చంద్రబాబు నాయుడుకి అవకాశం ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డికీ ఇచ్చారు. కానీ ఇద్దరిలో చంద్రబాబు నాయుడే మేలని భావించి మళ్ళీ ఆయనకే అధికారం కట్టబెట్టారు. ఎందుకంటే ప్రజల ఆకాంక్షలు ఆయనకు తెలుసు. వాటి ప్రకారమే పోవాలనుకుంటున్నారు కనుక!

జగన్‌కి అవకాశం ఇచ్చినప్పుడే ఒకటో రెండో మూడో రాజధానులు ఏర్పాటు చేసి చూపించి ఉండి ఉంటే ఆ క్రెడిట్ ఆయనకే దక్కి ఉండేది. నచ్చితే ప్రజలు మళ్ళీ ఆయనకే అధికారం కట్టబెట్టేవారు. కానీ ఆ అదృష్టాన్ని ఆయనే స్వయంగా కాలదన్నుకున్నారు. ఎప్పటిలాగే తాను అమితంగా ద్వేషించే చంద్రబాబు నాయుడుకే అమరావతి క్రెడిట్ దక్కేలా చేశారు. కనుక ఇప్పుడు బాధపడి, అసూయపడి ప్రయోజనం లేదు.

ADVERTISEMENT

మంచోచెడో అమరావతిని చంద్రబాబు నాయుడు మొదలుపెట్టారు కనుక ఆయనే పూర్తి చేసితీరాలి. కుంటి సాకులు చెప్పి తప్పించుకోలేరు. ఆ అవసరం కూడా లేదాయనకు.

హైదరాబాద్‌ని ఐటి కేంద్రంగా మార్చి చూపించిన అయన ఇప్పుడు ఏపీకి భవ్యమైన రాజధాని నిర్మించి తన శక్తిసామర్ధ్యాలు మరోసారి చాటుకోవాలని ఉవ్విళ్ళూరుతున్నారు. ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతి నిర్మాతగా చరిత్రలో తన పేరు శాశ్వితంగా నిలిచిపోవాలని కోరుకుంటున్నారు. కనుక అమరావతి పూర్తి బాధ్యత ఆయనదే అవుతుంది.

ఒకవేళ అమరావతి నిర్మించలేక చేతులెత్తేసినా అయనకే ఆ చెడ్డ పేరు వస్తుంది. కనుక అమరావతి విషయంలో జగన్మోహన్ రెడ్డి బ్యాచ్ దూరంగా, మౌనంగా ఉండటమే మంచిది.

కానీ అనవసరంగా ‘మావిగన్’ అంటూ మాట్లాడి నవ్వులపాలయ్యారు. చేజేతులా పార్టీకి ఇబ్బందికరమైన పరిస్థితి సృష్టించిపెట్టారు.

అమరావతిని వ్యతిరేకించినందుకే ఒకసారి వైసీపీ ఓటమి పాలైంది. కానీ మళ్ళీ ఇలా రోజుకో మాట మాట్లాడుతుంటే వైసీపీ ఎప్పటికైనా మళ్ళీ అధికారంలోకి రాగలదా?రాకపోతే మా పరిస్థితి ఏమిటని వైసీపీ నేతలు ఆలోచన చేయకుండా ఉండరు.

కానీ జగన్‌ అదృష్టమేమిటంటే వైసీపీ నేతలను చేర్చుకునేందుకు ఏ పార్టీ సిద్ధంగా లేదు. గత్యంతరం లేదు కనుకనే వైసీపీ నేతలు జగన్‌ని నమ్ముకొని వెంట నడుస్తున్నారు. కానీ పదేపదే తప్పటడుగులు వేసే సైన్యాధిపతిని నమ్ముకొని ఎవరూ యుద్ధానికి బయలుదేరరు.

జగన్‌ ధోరణి మారకపోతే వచ్చే ఎన్నికల నాటికి ఏకైక ప్రత్యామ్నాయంగా కనిపిస్తున్న కాంగ్రెస్‌ పార్టీలోకి వెళ్ళిపోయినా ఆశ్చర్యం లేదు.

ADVERTISEMENT
Latest Stories