గత వైసీపీ ప్రభుత్వం అమరావతిని కాదని విశాఖను రాష్ట్ర రాజధానిగా ప్రకటించి అమరావతి ప్రాంత ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొంది. అలాగే ఇటు రాజధానిగా ప్రకటించిన విశాఖలో అయినా వైసీపీ తన హవా కొనసాగించగలిగిందా అంటే అందుకు 2024 ఎన్నికల ఫలితాలే ప్రత్యక్ష సాక్ష్యాలుగా నిలిచాయి.
వైసీపీ రాజధానుల నిర్ణయంతో అమరావతిలో జరగాల్సిన అభివృద్ధిని ఆపేసింది, అలాగే రాజధానిగా ప్రకటించిన విశాఖ కూడా ఎటువంటి అభివృద్ధికి నోచుకోలేదు. దీనితో వైసీపీ ఇప్పుడు రెండిటి చెడ్డ రేవడి మాదిరి తయారయ్యింది.
ఒకపక్క వైసీపీ ఇలా రెండు ప్రాంతాల ప్రజల మనోభావాలతో రాజకీయ చదరంగం ఆడుతుంటే 2024 లో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం రెండు ప్రాంతాల ప్రజల మనోభావాలకు గౌరవం ఇస్తూ అటు రాజధానిగా అమరావతి పనులను పరుగులు పెట్టిస్తూ ఆ ప్రాంతాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకెళ్తుంది.
ఇక ఇటు విశాఖను పారిశ్రామికంగా అభివృద్ధి చేస్తూ ఐటీ హబ్ గా మార్చేందుకు అన్ని ప్రణాళికలను వేస్తుంది. ఇందులో భాగంగానే ఇప్పటికే టిసిఎస్ వంటి ప్రతిష్టాత్మక ఐటీ పరిశ్రమ కు భూకేటాయింపులు జరిపింది. అలాగే కాగ్నిజంట్ వంటి పరిశ్రమకు అనుమతులు ఇచ్చింది.
గూగుల్ సెంటర్ ఏర్పాటుతో ఏపీలోని విశాఖ దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ అయ్యింది. ఇరుగు పొరుగు రాష్ట్ర ప్రభుత్వాలు సైతం విశాఖలో కొలువుతీరనున్న గూగుల్ సెంటర్ పై బహిరంగ ప్రకటనలు చేసారు. దీనితో ఆంధ్రప్రదేశ్ ఇటు పారిశ్రామికంగా, ఆర్థికంగా ఒక్కో మెట్టు పైకెళ్తుంది.
ఇక ఈ నెల 14, 15 తేదీలలో విశాఖలో జరగబోయే పెట్టుబడుల భాగస్వామ సదస్సులో భాగంగా రాష్ట్రానికి 10 లక్షల కోట్ల పెట్టుబడులు రానున్నట్టు ఐటీ మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. తద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా లక్షల మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయి.
అయితే కూటమి ప్రభుత్వం రాజధానిగా అమరావతిని అభివృద్ధి చేస్తూనే అభివృద్ధి వికేంద్రీకరణ పేరుతో విశాఖను పరుగులు పెట్టిస్తుంది. దాని ఫలితంగా వైసీపీ ఎలా అయితే రెంటికి చెడ్డ రేవడి అయ్యిందో కూటమి రెండు ప్రాంతాల వారిని తమ వైపుకి ఆకర్శించుకోగలిగింది.






