నీతులు చెప్పడానికేనా.? అంబటికి ఆ అర్హత ఉందా.?

ambati-rambabu on Game Changer Pre Release Event

అధికారంలో ఉంటే అవసరానికి మించి నోటి దూల చూపించి ఛీత్కారాలు ఎదుర్కోవడం, ప్రతిపక్షంలో ఉంటే మోతాదుకు మించి అత్యుత్సాహం ప్రదర్శించి చివాట్లు తింటం వైసీపీ నేతల రాజకీయంలో భాగమైపోయింది.

తమ కోసం, తమ పార్టీ కోసం నిలబడిన వారి మీద చూపించాల్సిన ప్రేమను, ఆప్యాయతను తమ ప్రత్యర్థి పార్టీల బలహీనతల మీద చూపించి వాటితో రాజకీయం చేయడానికి ఉత్సుకత చూపిస్తుంది వైసీపీ. ఈ బాటలోనే అల్లు అర్జున్ పుష్ప వివాదాన్ని తలకెత్తుకున్న వైసీపీ అందుకు కొనసాగింపుగా ఇప్పుడు గేమ్ ఛేంజర్ విషాదాన్ని తెరమీదకు తెచ్చింది.

ADVERTISEMENT

పుష్ప బెనిఫిట్ షో కు గాను సంధ్యా థియేటర్ కు అల్లు అర్జున్ వచ్చిన సందర్భంగా జరిగిన తొక్కిసలాట కారణంగా రేవతి అనే మహిళ మృతి చెందిన విషయం, ఆమె కుమారుడు శ్రీతేజ్ ఆసుపత్రి పాలయిన వైనం తెలిసిందే. ఈ విషయంలో తెలంగాణ ప్రభుత్వానికి, అల్లు అర్జున్ కు మధ్య జరిగిన వివాదం, ఇక ఆ తరువాత జరిగిన పరిణామాలు అన్ని తెలిసిన విషయాలే.

అయితే నాడు రేవతి మరణం పై అల్లు అర్జున్ అరెస్టు ని ఖండించిన వైసీపీ, బన్నీకి మద్దతు తెలిపింది. కానీ నేడు గేమ్ ఛేంజర్ ఈవెంట్ సందర్భంగా జరిగిన ప్రమాదంలో ఇద్దరు అభిమానులు ప్రాణాలు కోల్పోయారు. ఇక తమ రాజకీయానికి వేళయరా అన్నటుగా వైసీపీ నేతలు సోషల్ మీడియాలో ప్రత్యక్షమయ్యారు. నాడు బన్నీని అరెస్టు చేసారు కాబట్టి నేడు పవన్ కళ్యాణ్ ను అరెస్టు చేయాలంటూ అర్ధం పర్ధం లేని విమర్శలు చేస్తున్నారు వైసీపీ నేతలు.

ఇక విషయం మీదకన్నా వివాదాల మీదే ఆసక్తి కనపరిచే మాజీ మంత్రి అంబటి పుష్పకేమో నీతులు చెపుతారా..గేమ్ ఛేంజర్ కు ఆ నీతులు పాటించారా అంటూ డిప్యూటీ సీఎం పవన్ ను టాగ్ చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసారు. అయితే ఈ రెండు ఘటనలలో సందర్భాలు వేరు, పరిస్థితులు వేరు. అక్కడ హీరో వెళ్లడం వలన ఆయనను చూడడానికి ఎగబడిన అభిమానుల మధ్య తొక్కిసలాట జరిగింది.

ఇక్కడ మూవీ ఫ్రీ రిలీజ్ ఫంక్షన్ కోసం వచ్చిన అభిమానుల బైక్లకు యాక్సిడెంట్ అయ్యి ప్రాణాలు కోల్పోయారు. అందునా ఈ దుర్ఘటన మీద చీఫ్ గెస్ట్ పవన్ నుంచి హీరో రామ్ చరణ్, చిత్ర నిర్మాత దిల్ రాజు స్పందిస్తూ బాధిత కుటుంబాలకు నష్ట పరిహారం ప్రకటించారు. అయితే కేవలం నష్ట పరిహారం చెల్లిస్తే సరిపోతుందా అంటే కాకపోవచ్చు.

బన్నీ వివాదంలో ఎదురయినా వ్యక్తిగత పరామర్శ అంశం కూడా ఇక్కడ అత్యంత కీలక పాత్ర పోషిస్తుంది. మరి ఆదిశగా గేమ్ ఛేంజర్ యూనిట్ అడుగువేయలేకపోతే ఇక్కడ కూడా మానవత్వ లోపం అనే అంశం తెరమీదకు వచ్చే అవకాశం ఉంటుంది. అయితే ఈ లోపే వైసీపీ నేతలు తమ అత్యుత్సాహాన్ని ప్రదర్శించి పవన్ ను అరెస్టు చేయాలంటూ ఒకరు, లేదు లేదు హీరో చెర్రీ ని బాధ్యుడిని చేయాలంటూ మరొకరు సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు.

ADVERTISEMENT
Latest Stories