వైసీపీ సీనియర్ కాపు నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మీద చేసిన అనుచిత వ్యాఖ్యలు, ఆపై టీడీపీ శ్రేణులకొచ్చిన బీపీలు, ఇక అక్కడ నుంచి మొదలైన వైసీపీ కాపు రాజకీయం మొత్తం అంబటి రాంబాబుని మీడియాలో హై లైట్ చేసాయి.
రాంబాబు అరెస్టు, ఆపై జగన్ పరామర్శ, ముద్రగడ ప్రకటనలు, ఉండవల్లి ప్రవచనాలు, వైసీపీ కాపు నేతల ఓదార్పు యాత్రలు, కాపు టైగర్ బిరుదులు, తగ్గేదెలా అంటూ అంబటి చేసిన యాక్షన్లు అన్నింటికి కూడా మీడియా చాల ప్రముఖంగా ప్రచారం కల్పించింది.
ఇక సాక్షిలో జరిగిన డిబేట్ల సంగతి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది అనేలా సాగాయి, వైసీపీ సోషల్ మీడియా రంగా హత్యను రాంబాబు అరెస్టు సరిపోల్చి, టీడీపీ కాపు ద్రోహి అనేలా మరోసారి రాష్ట్రంలో కమ్మ – కాపు మధ్య రాజకీయ చిచ్చుకు పొగరాచేశారు.
2024 ఎన్నికలలో కాపు ఓటింగ్ కోసం జగన్ ముద్రగడను రంగంలోకి దించితే ఇక రాబోయే ఎన్నికల కాపు ఓటింగ్ కోసం వైసీపీ అంబటి వ్యవహారాన్ని పూర్తిగా కుల రాజకీయం చేసేందుకు సిద్దమయ్యింది. ఇది కాపుల మీద జరిగిన దాడి, కాపు సామాజికవర్గానికి జరిగిన అవమానం అంటూ వైసీపీ పెద్ద ఎత్తున కులరాజకీయానికి పునాది వెయ్యాలనుకుంది. అలాగే తన పార్టీ తరుపున కాపు నేతగా అంబటికి గట్టి ప్రచారమే కల్పించింది.
ఇక బెయిలు మీద బయటకొచ్చిన అంబటి కూడా కొన్ని రోజుల పాటు నానా హంగామా చేసారు, మీడియా ఇంటర్ వ్యూలతో, పాదయాత్ర ప్రకటనలతో, పుష్ప సినిమా డైలాగ్స్ తో అంబటి వైసీపీ కాపు నేతల బ్రాండ్ గా మారేందుకు వచ్చిన అవకాశన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకున్నారు.
అయితే ఒక వ్యక్తి వివాదాన్ని కుల వివాదంగా మార్చేందుకు వైసీపీ చేసిన విశ్వ ప్రయత్నాలు, అంబటి రాంబాబు చేసిన ప్రకటనలు అన్ని కూడా వైసీపీ కి కేవలం ఆ రెండు రోజుల తాత్కాలిక ఆనందాన్ని మాత్రమే అందించగలిగాయి. కూటమి ప్రభుత్వానికి కాపు ఓటింగ్ ని దూరం చెయ్యాలని వైసీపీ వేసిన వ్యూహాలన్నీ కూడా కూటమి పార్టీల పొత్తు బంధం ముందు కొట్టుకుపోయాయి.
బాబు – పవన్ ల స్నేహం ముందు జగన్ – అంబటి రాజకీయం రాజీ పడక తప్పలేదు. దీనితో ఇక వైసీపీలో అంబటి కాపు రాజకీయానికి శుభం కార్డు పడినట్టేనా.? లేదా ఇంకా బాలన్స్ ఉంది అంటూ ఎన్నికల ముందు పార్ట్ – 2 తో ముందుకొస్తారా.? అన్నది ఆసక్తికరంగా మారింది.






