వైసీపీ మేధావుల్లో మాజీ మంత్రి అంబటి రాంబాబు కూడా ఒకరని అందరికీ తెలిసిందే. ఆయన ఏపీ సాగునీటి శాఖ మంత్రిగా ఉన్నప్పుడు, పోలవరం ప్రాజెక్టు గురించి ఆయన నోట జాలువారిన ఆణిముత్యాలు నేటికీ సోషల్ మీడియాలో మిలమిల మెరుస్తూనే ఉన్నాయి.
కనుక ఆయన మీడియా ముందుకు వచ్చి నాలుగు డైలాగ్స్ చెప్పినా, సత్తెనపల్లి రోడ్డుపై నాలుగు స్టెప్పులు వేసి డాన్స్ చేసి ప్రజలను అలరించినా ఆయనకు ఆయనే సాటి. ఇప్పుడు డాన్స్ చేయలేకపోతున్నప్పటికీ తరచూ సోషల్ మీడియాలో ప్రజలను అలరిస్తూనే ఉన్నారు.
అమరావతిపై జగన్ మళ్ళీ యూటర్న్ తీసుకున్నారంటూ కూటమి నేతల విమర్శలకు అంబటి రాంబాబు తనదైన శైలిలో సమాధానం చెప్పి వైసీపీ శ్రేణులకు చాలా ఆనందం కలిగించారు.
“అమరావతిపై మేము యూటర్న్ తీసుకున్నామా లేదా జే టర్న్ తీసుకున్నామా?అని ఇప్పుడెందుకు చర్చ?మరో మూడేళ్ళు మీరే అధికారంలో ఉంటారు కదా? కానీ వైసీపీ మళ్ళీ అధికారంలోకి వస్తే మేము అమరావతిలో ఉంటామా ఉండమా?అని అడుగుతున్నారు.
కూటమి ప్రభుత్వానికి మరో మూడేళ్ళు గడువు ఉండగానే మేము అధికారంలోకి వస్తే ఎక్కడ ఉంటామని అడుగుతున్నారంటే అర్దం ఏమిటి? వైసీపీ తప్పకుండా మళ్ళీ అధికారంలోకి వస్తుందనే కదా? మేము మళ్ళీ అధికారంలోకి వస్తామని కూటమి నేతలే ఒప్పుకుంటున్నారంటే అంతకంటే సంతోషకరమైన విషయం ఏముంటుంది?” అని అంబటి రాంబాబు తెలివిగా సమాధానం చెప్పారు.
అమరావతిపై జగన్ వైఖరి మారిందా లేదా?అనే ప్రశ్నకు అంబటి రాంబాబు సూటిగా సమాధానం చెప్పనే లేదు. కానీ ఆయన చెప్పిన ఈ నాలుగు ముక్కలు వైసీపీలకు తప్పకుండా సంతోషం కలిగిస్తాయి.
వైసీపీ భవిష్యత్తు అగమ్యగోచరంగా కనిపిస్తున్న ఈ సమయంలో ఇలాంటి అల్పసంతోషాలు వైసీపీ శ్రేణులకి, ముఖ్యంగా ఆ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డికి చాలా అవసరమే.





