మీరు కారులో ఆఫీసులకి, ఊళ్ళకి, తీర్ధయాత్రలకి వెళుతున్నారా?అయితే ఆ ఆలోచన మానుకోండి. పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగినందుకు కాదు. దారిలో ట్రాఫిక్ పోలీసులో… ఆర్టీవో సిబ్బందో వచ్చి మిమ్మల్ని దింపేసి మీ కారును సిఎం కాన్వాయ్ కోసం పట్టుకుపోవచ్చు.
సిఎం జగన్మోహన్ రెడ్డికేమి తక్కువ…ఆయన కాన్వాయ్లో డజన్లకొద్దీ కార్లున్నాయి కదా?అయినా ఆయనకు మా డొక్కు కారే కావాలా? అని ప్రశ్నలు అడగొద్దు. ఆ తరువాత చెప్పినా వినకుండా కారులో బయలుదేరి ఆనక కాన్వాయ్ కోసం కారు పట్టుకుపోయారని అసలే బాధపడొద్దు. నమ్మశక్యంగా లేదా? అయితే ‘కాన్వాయ్ బాధితుడు’ వేమల శ్రీనివాస్ స్టోరీ వినండి…
పల్నాడు జిల్లా వినుకొండకు చెందిన వేమల శ్రీనివాస్ తన భార్య ఇద్దరు పిల్లలు, మరో ఇద్దరు బంధువులతో కలిసి బుదవారం సాయంత్రం తన ఇన్నోవా కారులో తిరుమల శ్రీవారిని దర్శించుకొనేందుకు బయలుదేరారు. రాత్రి సుమారు 10 గంటలకు ఒంగోలు పాత మార్కెట్ సెంటరులో ఓ హోటల్ వద్ద ఆగి అందరూ టిఫిన్స్ చేస్తున్నారు.
ఇంతలో అక్కడికి ఓ హోం గార్డు వచ్చి సిఎం కాన్వాయ్ కోసం డ్రైవరుతో సహా కారు ఇవ్వాలని అడిగాడు. అది విని శ్రీనివాస్, కుటుంబ సభ్యులు ఆశ్చర్యపోయారు. తరువాత అతనిని ఎంతగా బ్రతిమాలుకొన్నా వినలేదు. “సారీ సార్..కారు ఇవ్వక తప్పదు…” అంటూ డ్రైవరుతో సహా కారుని పట్టుకుపోయాడు. దాంతో శ్రీనివాస్ భార్యా పిల్లలు ఊరుగానీ ఊరులో అర్దరాత్రి నడిరోడ్డుపై చిక్కుకుపోయారు. చివరకు శ్రీనివాస్ తన స్నేహితుడికి ఫోన్ చేసి వినుకొండ నుంచి కారు తెప్పించుకొని రాత్రి ఒంటి గంటకు దానిలో తిరుమలకు వెళ్ళారు.
ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ అయ్యి సిఎం జగన్మోహన్ రెడ్డి దృష్టికి వెళ్ళడంతో సీరియస్ అయ్యారు. సిఎం ఆదేశాల మేరకు అధికారులు సదరు హోంగార్డు పి.తిరుపతి రెడ్డిని, అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ ఏ.సంధ్యను సస్పెండ్ చేశారు. కారును తిరిగి శ్రీనివాస్కు అప్పగించి జరిగినదానికి ప్రభుత్వం తరపున క్షమాపణలు చెప్పారు.
కనుక కారులో వెళ్ళకండి… ఒకవేళ వెళ్ళినా సిఎం పర్యటించే ప్రాంతాల వైపు అసలే వెళ్ళకండి…వెళ్ళి కాన్వాయ్ కోసం కారు పట్టుకుపోతే అసలే బాధపడకండి.
https://twitter.com/Hidderkaran/status/1517013338655313920?s=20&t=YrlGR30quW3FA_xuB6AJKg



