వరి, అక్వా రంగాలలో కూడా ఏపీ పోటీ పడలేదా?

Aqua Culture Telanganaఒకప్పుడు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాన్ని దేశానికి అన్నం పెట్టే అన్నపూర్ణగా చెప్పుకొనేవారు. ఉభయగోదావరి జిల్లాలతో సహా రాష్ట్రంలో పలు జిల్లాలలో విస్తారంగా వరి పండించేవారు. పచ్చటి పేర్లు, చెట్లతో కళకళలాడే కోనసీమ అందాలను చూసేందుకు ఎక్కడికివారో వచ్చిపోతుండేవారు.

కానీ గత నాలుగున్నరేళ్ళుగా వైసీపీ ప్రభుత్వం సాగునీరు, వ్యవసాయరంగాలను నిర్లక్ష్యం చేస్తుండటంతో ఇదంతా గత వైభవంగా మారిపోతోంది. ఏపీలో వ్యవసాయం గురించి అడిగితే రైతులకిస్తున్న సంక్షేమ పధకాల గురించి మంత్రులు మాట్లాడుతుంటారు తప్ప ఈ రెండు రంగాల అభివృద్ధికి ఎటువంటి చర్యలు చేపడుతున్నారో చెప్పలేరు.

ADVERTISEMENT

ఇదే సమయంలో తెలంగాణ ప్రభుత్వం సాగునీరు, వ్యవసాయ రంగాలకు అత్యంత ప్రాధాన్యం ఇస్తూ దేశంలోకే అతిపెద్దదైన కాళేశ్వరం ప్రాజెక్టుని, పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టులను పూర్తిచేసి దశాబ్ధాలుగా బీడువారిని భూములకు ఏడాది పొడవునా నీరు పారిస్తోంది. ఎక్కడికక్కడ కాలువలు, రిజర్వాయర్లు నిర్మించి ప్రజలకు తాగు నీరు, రైతులకు సాగునీరు అందిస్తోంది.

దీంతో ఇప్పుడు తెలంగాణలో ఏడాదికి 3 పంటలు పండించేస్థితికి చేరుకొంది. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వరి పండిస్తూ ఏపీని ఎప్పుడో అధిగమించింది. ధాన్యం ఉత్పత్తి విషయంలో ఏపీ కంటే తెలంగాణ చాలా ముందుందిప్పుడు.

తెలంగాణలో నీటికి కరువు లేదు కనుక హరితహారం పధకంతో రాష్ట్రంలో పచ్చదనం గణనీయంగా పెంచింది. హరితహారంతో ఇప్పుడు తెలంగాణ ముఖ చిత్రమే పూర్తిగా మారిపోయింది. హైదరాబాద్‌ నగరంతో సహా తెలంగాణలో అన్ని జిల్లాలలో పచ్చదనం పెరగడంతో, ‘మాకు రాష్ట్రమంతా కోనసీమే’ అని తెలంగాణ ప్రజలు సగర్వంగా చెప్పుకొంటున్నారు.

ముఖ్యంగా చెప్పుకోవలసిన మరో విషయం ఏమిటంటే, ఏపీకి అతిపెద్ద సముద్రతీరం ఉన్నందున, రాష్ట్రంలో దశాబ్ధాలుగా అక్వా సాగు జరుగుతున్నందున ఇంతకాలం అక్వా రంగంలో ఆంద్రప్రదేశ్ దేశంలోనే అగ్రస్థానంలో నిలుస్తోంది.

కానీ తెలంగాణకు సముద్రతీరం లేదు. కృష్ణా, గోదావరి తదితర నదులుపారుతున్నా భౌగోళిక పరిస్థితుల కారణంగా తెలంగాణలో అక్వా సాగు చేయడం చాలా కష్టం. కానీ ఆక్వా రంగంలో తెలంగాణ వెయ్యి కోట్లు పెట్టుబడులు సాధించగలిగింది… ఎలా?

తెలంగాణ ప్రభుత్వం ‘మిషన్ కాకతీయ’ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 40-50 వేల చెరువులను పునరుద్దరించి వాటిలో గోదావరి జలాలను నింపుతోంది. ఆ చెరువులలో ఏటా కోట్లాది చేప పిల్లలు విడిచిపెడుతోంది. ఇదొక నిరంతర ప్రక్రియగా మార్చేయడంతో ఇప్పుడు తెలంగాణ అంతటా చేపల పెంపకం సాగుతోంది.

అలాగే కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా అనేక కాలువలు, రిజర్వాయర్లు నిర్మించుకొంది. వాటితో సాగు,త్రాగు నీరు అందిస్తూనే, వాటిలోనే చేపల పెంపకం చేపడుతోంది. అంటే అవకాశం లేని చోట అక్వా రంగానికి అవసరమైన వనరులను తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసుకొందన్నమాట!ఎంతగా అంటే ఇప్పుడు అక్వా రంగంలో రూ.1,000 కోట్లు పెట్టుబడులు సాధించే అంత!

తెలంగాణ ఐ‌టి, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్‌ దుబాయ్‌లో లులూ గ్రూప్‌తో ఒప్పందం చేసుకొని రాజన్న సిరిసిల్లా జిల్లా కేంద్రంగా భారీ అక్వా కోల్డ్ స్టోరేజ్, ప్రాసెసింగ్ యూనిట్లను ఏర్పాటు చేసేందుకు ఒప్పించారు. అంటే అక్వా రంగంలో కూడా ‘తెలంగాణ హవా’ మొదలైందన్న మాట!

అక్వా ఊసే లేని తెలంగాణ రాష్ట్రంలో ఆ రంగంలో వెయ్యి కోట్లు పెట్టుబడి సాధించడం, అక్వా పరిశ్రమలను ఏర్పాటు చేసుకోవడం, వాటితో వేలాది మందికి ఉద్యోగాలు, ఉపాధి కల్పించబోతుండటం విశేషమే కదా?పాలకులకు దూరదృష్టి, రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాలనే తపన, పట్టుదల, సంకల్పబలం ఉంటే ఇటువంటి అద్భుతాలు చేయవచ్చని తెలంగాణ ప్రభుత్వం నిరూపించి చూపుతోంది. మరి ఏపీ?

ADVERTISEMENT
Latest Stories