మూడు రోజుల మహానాడు అంగరంగ వైభవంగా, జగన్ కడుపులో మంటగా అద్భుతంగా సాగాయి. సిఎం చంద్రబాబు నాయుడు, మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ ముఖ్య నేతల ప్రసంగాలు పార్టీ క్యాడర్ని ఉర్రూతలూగించగా, మహానాడులో శాఖాహార, మాంసాహార వంటకాలు తిని భోజన ప్రియులు చాలా సంతోషించారు.
ఐదేళ్ళ జగన్ పాలనలో అందరూ నరకం అంటే ఎలా ఉంటుందో అనుభవించి మరీ చూశారు కనుక మహానాడు మరో సంక్రాంతి పండుగలాగే వారికి చాలా సంతోషం కలిగించింది. పార్టీ క్యాడర్లో నూతన ఉత్సాహం నింపడానికి, తమ పార్టీ బలం ఎంతో కళ్ళారా చూసి తెలుసుకోవడానికి, ప్రత్యర్ధులకు చాటేందుకు కూడా మహానాడు చాలా చక్కగా ఉపయోగపడింది.
మహానాడులో స్వోతకర్ష, ఉత్సాహంతో మీసాలు మేలేయడం, తొడలు కొట్టడం మామూలే. కనుక వాటిని పట్టించుకోనవసరం లేదు.
ఈసారి మహానాడులో సిఎం చంద్రబాబు నాయుడు టీడీపీకి దిశానిర్దేశం చేస్తూనే, జగన్ని తక్కువ అంచనా వేయడానికి లేదని, కనుక అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. మహానాడులో టీడీపీ కోసం ఆరు శాసనాలు (లక్ష్యాలు) చేసుకోవడం పార్టీని సరైన దారిలో నడిపిస్తాయి కనుక అది చాలా మంచి ఆలోచనే.
మహానాడు వేదికగా కూటమిలో మూడు పార్టీల మద్య బంధం బలంగా ఉంటుందని, భవిష్యత్లో కూడా కలిసే ముందుకు సాగుతామని స్పష్టంగా చెప్పారు. కనుక ఎవరూ పరిధి దాటకుండా రాజకీయాలు చేసుకోవాలని సూచించినట్లే భావించవచ్చు.
ఈసారి కూడా అభివృద్ధి, సంక్షేమ పధకాలకు తొలి ప్రాధాన్యం ఇస్తూనే, వైసీపీని రాజకీయంగా హ్యాండిల్ చేస్తుంటామని సిఎం చంద్రబాబు నాయుడు, మంత్రులు మహానాడు వేదికగా స్పష్టంగానే చెప్పారు. ఆంధ్రప్రదేశ్ అంటే అమరావతి, అభివృద్ధి అని యావత్ దేశ ప్రజలు అనుకునేలా చేస్తామని సిఎం చంద్రబాబు నాయుడు చెప్పడం ఏపీ భవిష్యత్ ఏవిదంగా ఉండబోతోందో సూచిస్తోంది.
కనుక గత మహానాడు సభలతో పోలిస్తే కడపలో జరిగిన మహానాడు మరింత అర్దవంతంగా సాగిందని చెప్పవచ్చు.




