దేశంలో ఎక్కడ గంజాయి పట్టుబడినా దాని మూలాలు ఆంధ్రప్రదేశ్లోనే ఉంటున్నాయి. ఏపీకి రాజధాని లేనప్పటికీ దేశంలో ‘గంజాయి రాజధాని’గా ప్రసిద్ధి చెందిందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.
ఏపీ ‘గంజాయి కీర్తి’ని మరింత ఇనుమడింపజేస్తూ ఇప్పుడు ఏపీ పోలీస్ శాఖకు చెందిన ఇద్దరు కానిస్టేబుల్స్ డ్యూటీకి సెలవు పెట్టి మరీ కారులో గంజాయి వేసుకొని హైదరాబాద్కు వెళ్ళి అక్కడి పోలీసులకు పట్టుబడ్డారు.
వీరిద్దరూ కాకినాడ ఏపీఎస్పీ మూడో బెటాలియన్లో కానిస్టేబుల్స్గా పనిచేస్తున్న సాగర్ పట్నాయక్, శ్రీనివాస్లుగా హైదరాబాద్ పోలీసులు గుర్తించారు. ఇద్దరూ డ్యూటీకి సెలవు పెట్టి కారు నంబర్: ఏపీ 39 క్యూహెచ్ 1769లో నర్సీపట్నం నుంచి 22 కేజీల గంజాయి ప్యాకెట్లు తీసుకొని హైదరాబాద్లో బాచుపల్లికి చేరుకున్నారు. అక్కడ ఓ వ్యక్తికి వాటిని అందిస్తుండగా, ఈ సమాచారం ఆందుకున్న బాలానగర్ పోలీసులు కాపు కాచి వారిని రెడ్ హ్యాండ్ పట్టుకొని అరెస్ట్ చేసి, కారుని, దానిలో ఉన్న గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.
వారిద్దరిపై కేసు నమోదు చేసి, ప్రస్తుతం బాలానగర్ పోలీస్ స్టేషన్లో విచారిస్తున్నారు. విచారణలో గంజాయి అమ్మి సులువుగా డబ్బు సంపాదించవచ్చనే ఉద్దేశ్యంతోనే ఈ నేరానికి పాల్పడిన్నట్లు వారు చెప్పిన్నట్లు తెలుస్తోంది.
ఏపీలో వైసీపి అధికారంలోకి వస్తే దశల వారీగా సంపూర్ణ మద్యనిషేధం అమలుచేస్తామని జగన్మోహన్ రెడ్డి పదేపదే చెప్పారు. కానీ అధికారంలోకి వచ్చాక రాష్ట్ర ప్రభుత్వమే మద్యం వ్యాపారం ప్రారంభించింది. రాష్ట్రంలో నకిలీ మద్యం విచ్చల విడిగా అమ్ముతూ ప్రజల ప్రాణాలతో చలగాటం ఆడుతున్నారని ప్రతిపక్షాలు ఎంతగా ఆరోపిస్తున్నా ప్రభుత్వం నుంచి స్పందన ఉండదు.
అలాగే రాష్ట్రంలో గంజాయి సాగు, సరఫరా విచ్చలవిడిగా సాగుతోందని మీడియా ఘోషిస్తున్నా ప్రభుత్వం స్పందించడం లేదు. బహుశః ఈ స్పూర్తితోనే ఆ ఇద్దరు పోలీస్ కానిస్టేబుల్స్కు కూడా గంజాయి వ్యాపారంలోకి దిగి ఉండవచ్చు.
ఏపీ పోలీస్ శాఖకు చెందిన ఇద్దరు పోలీసులు గంజాయి వ్యాపారం చేస్తుండటం, వారు పొరుగు రాష్ట్రంలో పోలీసులకు పట్టుబడటం ఏపీ పోలీస్ శాఖకు, రాష్ట్ర ప్రభుత్వానికి, ప్రజలకు కూడా అవమానమే కదా?




