పిల్లి తన పిల్లలను కాపాడుకొనేందుకు ఏడుసార్లు వాటిని వేరే చోటికి మారుస్తుందంటారు. రాష్ట్ర విభజన తర్వాత ఏపీ సచివాలయ అధికారులు, ఉద్యోగుల పరిస్థితి కూడా అలాగే మారింది.
చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అమరావతిని రాజధానిగా నిర్ణయించడంతో హైదరాబాద్లో పనిచేస్తున్న వారందరూ విజయవాడ, గుంటూరు నగరాలకు తరలివచ్చి స్థిరపడ్డారు.
ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత మూడు రాజధానుల ప్రతిపాదన తీసుకురావడంతో అందరూ గతుక్కుమన్నారు. అయితే అందరికీ తెలిసిన కారణాల వలన ఇంతవరకు ఆ ప్రతిపాదన అటకపైనే ఉండిపోవడంతో వారందరూ ఈ నాలుగేళ్ళు అక్కడే కాలక్షేపం చేసేశారు.
కానీ ఈ దసరాకి అంటే వచ్చే నెల 23 తేదీ నుంచి విశాఖ నుంచి పరిపాలన మొదలుపెడదామని, అందరూ మూటాముల్లె సర్ధుకోవాలని నాలుగు రోజుల క్రితం సిఎం జగన్ చెప్పడంతో మళ్ళీ సచివాలయ అధికారులు, ఉద్యోగులు అందరూ గతుక్కుమన్నారు.
ప్రస్తుతం విద్యాసంవత్సరం మద్యలో ఉన్నందున పిల్లల చదువులు మద్యలో ఉన్నాయి. కనుక ఇప్పుడు విశాఖకు మకాం మార్చాలంటే చాలా ఇబ్బందే. అదీగాక వేలాదిమంది అధికారులు, ఉద్యోగులు, దిగువ స్థాయి సిబ్బంది అందరికీ ప్రభుత్వం విశాఖలో ఇళ్ళు ఏర్పాటు చేసి ఇవ్వలేదు. ఒకవేళ ఇచ్చినా ఇంకా అనేక ఇతర ఇబ్బందులు ఉంటాయి.
లేడికి లేచిందే పరుగు అన్నట్లు జగన్ విశాఖ నుంచి పాలనకు ముహూర్తం ప్రకటించేశారు. కానీ హైకోర్టు, సుప్రీంకోర్టు ఇందుకు అనుమతిస్తాయో లేదో తెలీదు. ఒకవేళ అనుమతించినా ఒకేసారి ఇన్ని ప్రభుత్వ కార్యాలయాలు, ఇళ్ళు అన్నీ ఏర్పాటుచేసుకోవడం కష్టమే. బహుశః ఇప్పటికే గుట్టుగా అన్నీ ఏర్పాటు చేసుకొని ఉంటే అది సుప్రీంకోర్టు ఆదేశాలను ధిక్కరించిన్నట్లే అవుతుంది అది వేరే విషయం.
కానీ ఇప్పుడు అందరూ మూటాముల్లె సర్ధుకొని విశాఖకు తరలివచ్చేసిన తర్వాత రేపు శాసనసభ ఎన్నికలలో వైసీపి ఓడిపోయి టిడిపి-జనసేన కూటమి అధికారంలోకి వస్తే?మళ్ళీ అమరావతికి తిరుగు ప్రయాణం చేయక తప్పదు కదా?
ఆ తర్వాత ఎన్నికలలో అంటే 2029లో మళ్ళీ వైసీపి గెలిచి అధికారంలోకి వస్తే మళ్ళీ అమరావతి నుంచి విశాఖకు రాజధాని మార్చుతారా? అందరినీ తరలిస్తారా?ఇదంతా వింటుంటే ఎవరో గుర్తొస్తున్నారు కదా?



