రాష్ట్ర విభజనతో ఏపీకి రాజధాని లేకుండా పోయింది కానీ 5 విమానాశ్రయాలు లభించాయి. విశాఖ-విజయనగరం-శ్రీకాకుళం మూడు జిల్లాలకు సరిగ్గా మద్యలో నిర్మిస్తున్న అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణం వచ్చే ఏడాది జూన్, జూలైలో పూర్తవబోతోంది.
అమరావతిలో అతిపెద్ద అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణం కొరకు భూసేకరణకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. ఇవి కాక మరో అరడజను విమానాశ్రయాల ఏర్పాటుకు నిశబ్దంగా సన్నాహాలు జరుగుతున్నాయి.
అంటే రాష్ట్ర విభజనతో సగమైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దాదాపు డజను విమానాశ్రయాలు ఉంటాయన్న మాట!
కానీ ఏపీ కంటే చాలా అభివృద్ధి చెందిన తెలంగాణ రాష్ట్రంలో నేటికీ శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం ఒక్కటే ఉంది. ఇదివరకు వినియోగించిన బేగంపేట విమానాశ్రయం రాష్ట్రపతి, ప్రధాని, గవర్నర్, ముఖ్య మంత్రులు, వీవీఐపీలకే పరిమితమైంది. కనుక దానిని పరిగణనలోకి తీసుకోలేము.
వరంగల్ వద్ద మామునూరు, ఖమ్మం, నిజామాబాద్ జిల్లాలలో విమానాశ్రయాల ప్రతిపాదనలలో ఏమాత్రం పురోగతి లేదు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మద్య సత్సంబంధాలు లేకపోవడం, కాంగ్రెస్, బీఆర్ఎస్-బీజేపిల మద్య రాజకీయాలే ఇందుకు కారణంగా కనిపిస్తోంది.
ఇప్పుడు మళ్ళీ ఏపీ విమానాశ్రయాల గురించి చెప్పుకుంటే, తాజాగా ప్రకాశం జిల్లాలో ఒంగోలులో విమానాశ్రయం ఏర్పాటుకి డీపీఆర్ సిద్దమవుతోంది.
ఒంగోలు-కొత్త పట్నం రహదారిలో అల్లూరు-ఆలూరు పరిసర గ్రామాలలో సుమారు వెయ్యి ఎకరాలలో ఈ విమానాశ్రయం ఏర్పాటు కాబోతోంది.
దీని కోసం రాష్ట్ర ప్రభుత్వం కోల్కత్తాకు చెందిన ఓ సర్వే సంస్థకు బాధ్యత అప్పగించింది. ఆ సంస్థకు చెందిన నిపుణుల బృందం ఇటీవల ఒంగోలులో ప్రతిపాదిత ప్రాంతాలలో పర్యటించి సర్వే చేశారు.
వారు గ్రామస్థులు, స్థానిక ఎమ్మెల్యే, ఎంపీ, అధికారులతో భూసేకరణ, భౌగోళిక, ఆర్ధిక, సాంకేతిక వివరాల గురించి లోతుగా చర్చించారు. ఆ వివరాలన్నీ క్రోడీకరించిన తర్వాత మరోసారి క్షేత్రస్థాయిలో పర్యటించి వాటి ఆధారంగా సాధ్యాసాధ్యాల గురించి చర్చిస్తారు. తర్వాత ప్రభుత్వానికి తమ నివేదిక సమర్పిస్తారు.
వడ్డించేవాడు మనవాడు అయితే బంతిలో చివర కూర్చున్నా అన్నీ విస్తర్లో పడతాయన్నట్లు, డీపీఆర్ సిద్దమైతే పౌర విమానయాన శాఖా మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు మనోడే కనుక మిగిలిన పనులు ఆయన చక్కబెట్టేస్తారు.
కనుక వచ్చే ఎన్నికల నాటికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కనీసం మరో రెండు మూడు విమానాశ్రయాలు తప్పక అందుబాటులో వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఏమిటి? ఇప్పుడెలా? అని ఆందోళన చెండుతున్న ప్రజలకు ఇది గొప్ప ఊరటనిస్తుంది.. కదా!






