తెలుగు సినిమాలకు పుట్టిల్లు వంటిది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. సినీ పరిశ్రమలో చాలా మంది నిర్మాతలు, దర్శకులు, నటీనటులు, కధా రచయితలు ఆంధ్రప్రదేశ్కి చెందినవారే. అయితే ఇప్పుడు తెలుగు సినీ పరిశ్రమకు తెలంగాణ రాష్ట్రం పుట్టిల్లుగా మారగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అత్తింటి ఆరళ్ళు తప్పడం లేదు.
దీనికి ప్రధానంగా మూడు కారణాలు కనిపిస్తున్నాయి. 1. కమ్మ కులస్థులను అకారణంగా ద్వేషిస్తున్న జగన్ సర్కార్, సినీ పరిశ్రమలో వారి సంఖ్యే ఎక్కువగా ఉన్నందున, వారిలో చాలా మంది టిడిపికి, చంద్రబాబు నాయుడు సన్నిహితంగా మెలుగుతుండటం. 2. పవన్ కళ్యాణ్ జనసేనతో జగన్ ప్రభుత్వాన్ని ఢీకొంటుండటం. 3. తెలుగు సినీ పరిశ్రమ తెలంగాణ సిఎం కేసీఆర్కు ఆయన ప్రభుత్వానికి ఇస్తునంత ప్రాధాన్యత, గౌరవం తనకు ఇవ్వడం లేదనే అక్కసు.
కనుక జగన్ ప్రభుత్వం తెలుగు సినీ పరిశ్రమకు తన తడాఖా చూపించేందుకు సినీ నియంత్రణ చట్టం తెచ్చి టికెట్ రేట్లు భారీగా తగ్గించేసింది. నియమనిబందల పేరిట థియేటర్ యజమానులను వేదించి సినీ ప్రదర్శనలకు అవరోదాలు సృష్టించింది. భారీ బడ్జెట్ సినిమాలకు అత్యంత కీలకమైన మొదటి పది రోజులలో టికెట్ ధరలపై ఆంక్షలు విధించింది.
దాంతో సిఎం జగన్మోహన్ రెడ్డి కోరుకొన్నట్లుగానే చిరంజీవి నేతృత్వంలో సినీ ప్రముఖులు అందరూ ఆయన ఇంటికి వెళ్ళి చేతులు జోడించి తమను ఇబ్బంది పెట్టవద్దని అభ్యర్ధించారు. అప్పటికి కాస్త శాంతించినా అదనపు ఆదాయం కోసం దేవులాడుతున్న జగన్ ప్రభుత్వం దృష్టి సినీ పరిశ్రమపై పడింది. కానీ సినీ ఇండస్ట్రీ హైదరాబాద్లో ఉండిపోవడంతో ఏమీ చేయలేక సినీపరిశ్రమను దారికి తెచ్చుకొనేందుకు దానికి ఆయువు పట్టైన సినిమా టికెట్లను ఏపీఎఫ్డీసీ ద్వారానే ఆన్లైన్లో అమ్మాలని హుకుం జారీ చేసింది. తద్వారా ఒక్కో టికెట్ అమ్మకంపై 2 శాతం సర్వీసు ఛార్జీగా వసూలు చేయడం మొదలుపెట్టింది.
థియేటర్ యజమానులకు వేరే గత్యంతరం లేకపోవడంతో అందుకు అంగీకరించవలసి వచ్చింది. కానీ ప్రభుత్వం చేతికి వెళ్ళిన టికెట్ల సొమ్మును వెంటనే వాపసు చేయకుండా అట్టేబెట్టుకొని ఆలస్యం చేస్తుండటంతో గగ్గోలు పెడుతున్నారు.
తూర్పు గోదావరి జిల్లాలో 33, కాకినాడ జిల్లాలో 45, కోనసీమ జిల్లాలో 56 థియేటర్లకు చెల్లించాల్సిన సొమ్ము ప్రభుత్వం వాపసు చేయకపోవడంతో వారు గగ్గోలు పెడుతున్నారు. టికెట్ ధరలు తగ్గించడంతోనే తీవ్రంగా నష్టపోతున్న తమకు, టికెట్ల సొమ్ము కూడా ప్రభుత్వమే తీసేసుకొంటే ఇక థియేటర్లు నడిపించలేమని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈరోజు బుక్ అయిన టికెట్ల సొమ్ము మర్నాటికల్లా థియేటర్ యాజమానుల బ్యాంక్ ఖాతాలలో జమా చేస్తామని చెప్పి మూడు నాలుగు రోజులకోసారి చెల్లిస్తుంటే థియేటర్లను ఎలా నిర్వహించాలని వారు ప్రశ్నిస్తున్నారు.
తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలు, కోనసీమ, కృష్ణా జిల్లాలలోని థియేటర్ యజమానులు, ఫిలిమ్ డిస్ట్రిబ్యూటర్లు సోమవారం రాష్ట్ర ఫిల్మటోగ్రఫీ మంత్రి వేణుగోపాలకృష్ణను రామచంద్రాపురంలో కలిసి తమ గోడు మొర పెట్టుకొన్నారు.
ఎప్పటికప్పుడు టికెట్ల సొమ్ము వాపసు చేయకపోతే థియేటర్లు మూసుకోక తప్పదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితులలో ఏపీఎఫ్డీసీ ద్వారానే ఆన్లైన్లో టికెట్లు అమ్మలనే నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. అయితే వారిది అరణ్యరోదనే అవుతుందని అందరికీ తెలుసు.
ఒకప్పుడు ఏపీలో నిత్యకల్యాణం పచ్చతోరణం అన్నట్లు ఏడాది పొడవునా డజన్ల కొద్దీ సినిమాలు రిలీజ్ అవుతుండేవి. థియేటర్లన్నీ ప్రేక్షకులతో కళకళలాడుతుండేవి. ఎప్పుడు చూసినా థియేటర్ల వద్ద పండగ వాతావరణం నెలకొని ఉండేది. కానీ ఇప్పుడు థియేటర్ల వద్ద ఆ సందడీ లేదు… ఆ సంతోషమూ కనబడటం లేదు. థియేటర్లు నడపడమంటే ప్రతీరోజూ అగ్నిపరీక్షగా మారిపోయింది. థియేటర్ల రాబడి మీదనే తెలుగు సినీ పరిశ్రమ మనుగడ ఆధారపడి ఉంటుంది. కనుక సినీ ప్రైశ్రమకు, సినీ థియేటర్లకు ఇది చాలా గడ్డుకాలమే. మరి దీనికి అంతం ఎప్పుడో?



