సంధ్య థియేటర్ ఘటన, అల్లు అర్జున్కి సినీ ప్రముఖుల పరామర్శలు, అల్లు అర్జున్ ప్రెస్మీట్ పుణ్యామాని సంక్రాంతికి విడుదలవుతున్న గేమ్ చేంజర్ (జనవరి 10), డాకూ మహరాజ్ (జనవరి 12), సంక్రాంతికి వస్తున్నాం (జనవరి 14).. మూడు సినిమాలకు బెనిఫిట్ షోలు వేసుకునేందుకు, టికెట్ ఛార్జీలు పెంచుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం అనుమతించలేదు.
సినీ పరిశ్రమకి ‘సంక్రాంతి సీజన్’ చాలా కీలకం. సినిమాలు కాస్త అటూ ఇటూగా ఉన్నా ఈ సీజన్లో కలెక్షన్స్ రాబట్టుకొని ఒడ్డున పడగలవు. అదే.. పెద్ద సినిమాలకు టాక్ బాగుంటే ఇంకా కలెక్షన్స్ కనక వర్షమే. ఇంత ముఖ్యమైన ఈ సంక్రాంతి సీజన్లో మూడు పెద్ద సినిమాలకు తెలంగాణలో ఈ అదనపు ఆదాయం కోల్పోయాయి.
ఎఫ్డీసీ ఛైర్మన్, నిర్మాత దిల్రాజు చివరి ప్రయత్నంగా ఇవాళ్ళ సిఎం రేవంత్ రెడ్డిని కలిసి టికెట్స్ ధర పెంపు గురించి మరోసారి అభ్యర్ధిస్తానని చెప్పారు. శాసనసభలో, మళ్ళీ సినీ ప్రముఖుల సమావేశంలో అంత ఖచ్చితంగా చెప్పిన తర్వాత రేవంత్ రెడ్డి మనసు మార్చుకుంటారని అనుకోలేము. మరికొద్ది సేపటిలో రేవంత్ రెడ్డి ఏమన్నారో తెలుస్తుంది.
అయితే సంక్రాంతి సినిమాలకు అనూహ్యంగా మరో పెద్ద గండం పొంచి ఉంది. ఎఫ్1 రేసింగ్ కేసులో బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీర్ని ఏసీబీ ఏ క్షణంలోనైనా అరెస్ట్ చేసే అవకాశం ఉందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. రేపు (గురువారం) ఆయన ఏసీబీ విచారణకు హాజరు కావాల్సి ఉంది.
ఒకవేళ రేపు కేటీఆర్ని అరెస్ట్ చేస్తే బిఆర్ఎస్ పార్టీ శ్రేణులు రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు తెలియజేసేందుకు సన్నాహాలు చేసుకుంటున్నాయి.
ప్రజలు సంతోషంగా సంక్రాంతి పండగ చేసుకుంటుంటే, సినిమాలు చూసేందుకు తరలివస్తారు. కానీ బిఆర్ఎస్ పార్టీ శ్రేణులు రోడ్లపై ధర్నాలు, నిరసన కార్యక్రమాలు చేస్తుంటే, వారిని అడ్డుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తే తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంటుంది. కనుక అటువంటి సమయంలో ప్రజలు సినిమా థియేటర్లకు వెళ్ళేందుకు ఇష్టపడరు.
ఒకవేళ కేటీఆర్ని అరెస్ట్ చేస్తే ఈ మూడు సినిమాలపై ప్రభావం పడుతుంది. ఎంతో కొంత నష్టపోయే అవకాశం కూడా ఉంటుంది. కనుక టికెట్ ఛార్జీలు పెంచకపోయినా కేటీఆర్ని సంక్రాంతి పండుగ తర్వాత అరెస్ట్ చేసుకోమని దిల్రాజు కోరాలేమో?




