టిడిపి నిర్ణయం మంచిదే కానీ అవమానాలు భరించాలి!

TDP Cadreగురువారం నుంచి ఏపీ శాసనసభ సమావేశాలు మొదలవబోతున్నాయి. చంద్రబాబు నాయుడు అరెస్టుని నిరసిస్తూ ఈ సమావేశాలను టిడిపి బహిష్కరిస్తుందని వైసీపి నేతలు భావిస్తుంటే, సమావేశాలకు హాజరుకాబోతున్నామని టిడిఎల్పీ ప్రకటించింది. ప్రస్తుతం ఢిల్లీలో ఉన్న నారా లోకేశ్‌ జూమ్ ద్వారా పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో సమావేశమయ్యి దీని గురించి లోతుగా చర్చించారు.

అందుబాటులో ఉన్న ప్రతీ వేదికని, అవకాశాన్ని ఉపయోగించుకొంటూ చంద్రబాబు నాయుడు అరెస్టుని నిరసిస్తూ ఆందోళనలు చేస్తున్నందున, శాసనసభ సమావేశాలకు కూడా హాజరయ్యి శాసనసభ సాక్షిగా నిరసనలు తెలియజేయాలని నిర్ణయించారు. శాసనసభ, మండలిలో వైసీపి సభ్యులు తమని అవమానపరిచేందుకు ప్రయత్నించవచ్చని, అయినప్పటికీ పోరాటమే అజెండాగా ముందుకు సాగుతున్నందున ఎన్ని అవమానాలనైనా భరిద్దామని నిర్ణయించారు.

ADVERTISEMENT

శాసనసభలో టిడిపి సభ్యులను మాట్లాడనీయకుండా స్పీకర్ మైకులు కట్ చేసినా నిరసనలు తెలియజేస్తూనే ఉండాలని, ఒకవేళ సభ నుంచి బహిష్కరిస్తే బయట శాసనసభ ఆవరణలో నిలబడి నిరసనలు తెలియజేయాలని నారా లోకేశ్‌ సూచించారు.

ఎట్టి పరిస్థితులలో నిరసనలు, పోరాటాలు ఆపకూడదని నిర్ణయించారు. శాసనసభ సమావేశాలు ముగిసిన తర్వాత టిడిపి నేతలందరూ ప్రజల మద్యకు వెళ్ళి జగన్‌ ప్రభుత్వం రాజకీయ కక్ష సాధింపుల గురించి, వైసీపి నేతల అవినీతి భాగోతాల గురించి ప్రజలకు వివరించి, జగన్‌ ప్రభుత్వాన్ని ఎండగట్టాలని టీడిఎల్పీ సమావేశంలో నిర్ణయించారు.

శాసనసభ సమావేశాలకు టిడిపి హాజరవ్వాలనుకోవడం చాలా మంచి నిర్ణయమే. లేకుంటే శాసనసభలో ప్రశ్నించేవారే ఉండరు కనుక సిఎం జగన్‌తో సహా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరూ చంద్రబాబు నాయుడు, నారా లోకేశ్‌, టిడిపి నేతలందరూ అవినీతిపరులే అని అందుకే వారిని అరెస్ట్ చేస్తున్నామంటూ శాసనసభ సాక్షిగా ప్రజలను నమ్మించే ప్రయత్నం చేస్తారు.

గతంలో చంద్రబాబు నాయుడునే శాసనసభలో దారుణంగా అవమానించి కంటతడిపెట్టించి ఇప్పుడు జైలుకి కూడా పంపి పైశాచికానందంతో పొంగిపోతున్న వైసీపి సభ్యులు రేపు సమావేశాలకు హాజరయ్యే టిడిపి సభ్యులను ఇంకా దారుణంగా అవమానించడం ఖాయమే. అందుకు సిద్దపడే టిడిపి సభ్యులు సమావేశానికి హాజరవుతుండటం ద్వారా టిడిపి, వైసీపిల ప్రవర్తన, మాట తీరు మద్య ఎంత తేడా ఉందో శాసనసభ సాక్షిగా ప్రజలకు చూపించగలుగుతారు.

ADVERTISEMENT
Latest Stories