అమరావతి భూముల వేలం…ఏట్లో పిసికిన చింతపండు

AP government Amaravati Lands For Saleఏట్లో ఎంత చింతపండు పిసికినా ప్రయోజనం ఉండదు. గోడకు వేసిన సున్నం తిరిగిరాదు. అటువంటిదే అమరావతిలో భూముల వేలంపాట నిర్ణయం కూడా అని చెప్పక తప్పదు.

అమరావతిలో నిర్మాణ పనులు, అభివృద్ధి పనులకు బ్యాంకులు అప్పు ఇవ్వడం లేదు. కేంద్రం విధిలిచడం లేదు. రాష్ట్ర ప్రభుత్వం చేతిలో చిల్లి గవ్వలేదు కనుక అమరావతిలో తొలి విడతలో 248.34 ఎకరాలను ఎకరం రూ.10 కోట్లు చొప్పున అమ్మేందుకు ప్రభుత్వం జీవో నంబర్ 389ని జారీ చేసింది.

ADVERTISEMENT

గత ప్రభుత్వం మెడ్‌సిటీ నిర్మాణం కోసం ఇచ్చిన 100 ఎకరాలను, లండన్ కింగ్స్ కాలేజీ నిర్మాణం కోసం ఇచ్చిన 148 ఎకరాలను వేలం వేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.

రెండో విడతలో అంటే వచ్చే ఏడాదిలో మరో 600ఎకరాలను వేలం వేయాలని నిర్ణయించింది. ఆ తరువాత అవసరాన్ని బట్టి ఏడాదికి 50 ఎకరాల చొప్పున వేలం వేయాలని సీఆర్డీయే నిర్ణయించింది. తొలివిడత 248.34 ఎకరాల వేలం ద్వారా ప్రభుత్వం రూ.2,480 కోట్లు సమకూర్చుకోవాలని భావిస్తోంది. దాంతో రాజధాని ప్రాంతంలో అభివృద్ధి,నిర్మాణ పనులు చేపడతామని సీఆర్డీయే చెపుతోంది.

ఒకవేళ అమరావతి నిర్మించాలని జగన్ ప్రభుత్వానికి పట్టుదల, చిత్తశుద్ధి, నిబద్దత ఉంటే ఈ నిర్ణయాన్ని తప్పు పట్టలేము. కానీ నేటికీ వైసీపీ ప్రభుత్వం అమరావతిని రాజధానిగా అంగీకరించడంలేదని అందరికీ తెలుసు. మంత్రులు అప్పుడప్పుడు నిద్రలో కలవరించినట్లు తమ ప్రభుత్వం మూడు రాజధానులకే కట్టుబడి ఉందని చెపుతుండటమే ఇందుకు సాక్ష్యం.

కానీ హైకోర్టు ఒత్తిడి వలన కావచ్చు లేదా మళ్ళీ ఎన్నికలు దగ్గర పడుతున్నందున కావచ్చు అమరావతిలో నిర్మాణ పనులు, అభివృద్ధి పనులు చేసేందుకు అయిష్టంగానే అంగీకరించవలసి వచ్చింది. కానీ ప్రభుత్వానికి అమరావతి నిర్మించాలనే తపన, తాపత్రయం, నిబద్దత కొరవడినందున, అమరావతి నిర్మాణం కంటే ఎన్నికలలో వైసీపీకి లబ్ది కలిగించే సంక్షేమ పధకాలే ప్రాధాన్యం ఇస్తున్నందున, ఈ భూముల వేలం ద్వారా వచ్చిన డబ్బు కూడా సంక్షేమ పధకాలకే మళ్లించే అవకాశాలే ఎక్కువ. అంటే వ్రతం చెడ్డా ఫలం దక్కలేదన్నట్లు అమరావతిలో కోట్లు విలువ చేసే భూములన్నీ చూస్తుండగానే కళ్ల ముందు కరిగిపోతాయి. మిగిలిన ఈ రెండేళ్ళలో రాష్ట్ర ప్రభుత్వం ఎలాగూ అమరావతిని పూర్తి చేయదు.. చేయలేదు కూడా. వాటిని అమ్మగా వచ్చిన డబ్బు కూడా కరిగిపోతుంది.

అసలు సంక్షేమ పధకాలను కొనసాగించడం కోసం అప్పుల కోసం వెతుకులాడుతున్న జగన్ ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు కలిసివచ్చాయని చెప్పవచ్చు. హైకోర్టు ఆదేశం మేరకు అమరావతి నిర్మాణం కోసం అని చెప్పుకొంటూ భూములు అమ్ముకొనే ప్రయత్నం చేస్తున్నట్లు ప్రతిపక్షాలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. కనుక అమరావతి నిర్మించినా నిర్మించకపోయినా అమరావతిలో భూములు కరిగించేయడం మాత్రం ఖాయం అని స్పష్టం అవుతోంది.

ADVERTISEMENT
Latest Stories