దేశంలో అనేక రాజ్యాంగ వ్యవస్థలున్నాయి. అవి కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలలో ఏ పార్టీ అధికారంలో ఉన్నాయనే దాంతో సంబందం లేకుండా నిష్పక్షపాతంగా, పారదర్శకంగా పని చేయాల్సి ఉంటుంది. కానీ ఇప్పుడు దేశంలో చాలా వ్యవస్థలు అధికారంలో ఉన్న పార్టీ నేతల, వారి ప్రభుత్వ కనుసన్నలలో పనిచేయడానికి అలవాటుపడ్డాయి. ఈ కారణంగా ఆ వ్యవస్థలలో పనిచేస్తున్న అధికారులు, ఉద్యోగులే న్యాయస్థానాలలో మొట్టికాయలు వేయించుకోవలసి వస్తోంది. అయినప్పటికీ స్వతంత్రంగా పనిచేయలేక, పాలకులను ధిక్కరించలేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ఉదారణకు రెండు నెలల క్రితం ఆంధ్రప్రదేశ్లో 8 మంది ఐఏఎస్ అధికారులు ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరించి కోర్టు ధిక్కారానికి పాల్పడినందుకు హైకోర్టు వారికి నెలరోజులు జైలు శిక్ష, రూ.2,000 జరిమానా విధించింది. వారు హైకోర్టుకి క్షమాపణలు చెప్పుకొని జైలుకి వెళ్ళకుండా తప్పించుకొన్నారు.
హైదరాబాద్ గచ్చిబౌలిలో ఉంటున్న వైసీపీ నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణ రాజు ఇంట్లోకి సోమవారం ఉదయం ఓ వ్యక్తి జొరబడి తన మొబైల్ ఫోన్తో ఇంటిలోపల భాగాన్ని చిత్రీకరించే ప్రయత్నం చేస్తుండగా, సిసి టీవీ కెమెరాలలో చూసిన రఘురామ భద్రతా సిబ్బంది అతనిని పట్టుకొని చితకబాది గచ్చిబౌలి పోలీసులకు అప్పగించారు.
పోలీసుల విచారణలో అతను ఏపీ ఇంటలిజన్స్ కానిస్టేబుల్ ఎస్కే ఫరూక్ బాషా అని చెప్పడంతో, అతని ఐడీ కార్డు చూసి నిజమే అని దృవీకరించుకొన్నారు. మొత్తం 12 మంది రెండు ఇన్నోవా కార్లలో హైదరాబాద్ చేరుకొని ఎంపీ రఘురామపై నిఘా పెట్టామని చెప్పడంతో గచ్చిబౌలి పోలీసులు కూడా అవాకయ్యారు.
ఎందుకంటే, రఘురామకృష్ణ రాజు ఉగ్రవాదో…వేర్పాటువాదో…మావోయిస్టో కాదు ఆయనపై నిఘా పెట్టడానికి. పైగా రఘురామను దిల్కుశ గెస్ట్ హౌసులో ఏపీ సీఐడీ పోలీసులు విచారించడానికి హైకోర్టు అనుమతించింది కూడా. ఆ విచారణలో వారికి సహకరించాలని హైకోర్టు ఆయనను కూడా ఆదేశించింది. అయినప్పటికీ వారు ఈవిదంగా ఆయనపై నిఘా పెట్టడం ఎందుకు?దొరికిపోయి దెబ్బలు తినడం ఎందుకు?
స్వతంత్రంగా, నిష్పక్షపాతంగా, పరదర్శకంగా వ్యవవహరించాల్సిన వ్యవస్థలు, వాటిలో అధికారులు, ఉద్యోగులు ప్రభుత్వ కనుసన్నలలో పనిచేస్తూ ఏవిదంగా ఇబ్బందులలో చిక్కుకొంటున్నారో తెలుసుకొనేందుకు ఇదో తాజా ఉదాహరణ.
ఈవిదంగా చేస్తుండటం వలన వారు ప్రతిపక్షాల ఆగ్రహానికి కూడా గురవుతున్నారు. తాము అధికారంలోకి రాగానే ప్రతీ అధికారి, ఉద్యోగిపై కటినమైన చర్యలు తీసుకొంటామని హెచ్చరిస్తుండటంతో వారి పరిస్థితి ముందు నుయ్యి వెనుక గొయ్యి అన్నట్లు తయారైంది.
అసలు ఈవిదంగా ఎందుకు జరుగుతోందంటే పాలకులు వ్యవస్థలను, వాటి పనిని అవి చేసుకోనీయకుండా తమ కనుసన్నలలో పనిచేయాలని భావిస్తుండటం వలననే! కానీ చివరికి మూల్యం చెల్లించేది మాత్రం ఆ వ్యవస్థలలో అధికారులు… ఉద్యోగులే. సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు ఇందుకు మరో నిదర్శనంగా కళ్ళ ముందే ఉన్నారు.



