అమరావతి నాశనం కోసం వైసీపీ కి ఎప్పుడు ఎదో ఒక కారణం కనిపిస్తూనే ఉంటుంది, అందుకోసం ఎవరొకరు వైసీపీ చేతిలో ఒక ఆయుధాన్ని పెడుతూనే వస్తున్నారు. నాడు ఆర్కే సాయంతో అమరావతి వినాశనానికి నాంది పలికిన వైసీపీ ఇప్పుడు ఆ స్థానంలోకి వేమారెడ్డి, పేర్ని నాని, అంబటి, అవినాష్ అంటూ మరికొంతమంది కొత్త నేతలను తెరమీదకు తెచ్చింది.
అయితే ఇక్కడ నాడు అమరావతి పై వైసీపీ రాజకీయానికి సహకరించింది, నేడు వైసీపీ రాక్షసత్వానికి సాయం చేస్తుంది కూడా ఆ ప్రాంతంలోని కొంతమంది రైతులే కావడం బాధాకరం. అయితే అమరావతి లో కమ్మ సామాజికవర్గం వారే అధికారం అని, బాబు తన సామాజికవర్గం వారి అభ్యున్నతికే అమరావతి నిర్మాణాలు చేపడుతున్నారని,
అది అమరావతి కాదు కమ్మరావతి అంటూ సొంత రాష్ట్ర రాజధాని నిర్మాణాలను అడ్డుకోవడానికి ఆ ప్రాంత ప్రజలనే ఎరగా వాడుకుంటున్నారు వైసీపీ నేతలు. అయితే ఉండవల్లి, పెనుమాక, తాడేపల్లి ఇలా రాజధాని ప్రాంత పరిధి లో ఉండే అనేక గ్రామాలలో రెడ్డి సామాజికవర్గం వారి ప్రాధాన్యతే అధికం అనేది జగమెరిగిన సత్యమే.
అయితే నాటి నుంచి నేటి వరకు ఆ బలమే వైసీపీ కి ఒక ఆయుధంగా మారుతుంది, వైసీపీ చేతికి అస్త్రాలను అందిస్తుంది. రాజధాని రైతుల కోరిక మేరకే మేము రాజధాని ప్రాంతంలో పర్యటించడానికి వెళ్ళాం అని, అయితే అక్కడ రైతుల పేరుతో టీడీపీ గుండాలు తమ పై దాడి చేసారంటూ ఆరోపిస్తున్న వైసీపీ నేతలు గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఏనాడైనా అమరావతి రైతుల సమస్యలు తెలుసుకునే ప్రయత్నం చేసారా.?
అమరావతి నిర్మాణానికి భూములివ్వని రైతులను కూటమి ప్రభుత్వం వేధిస్తోందని, పెనుమాక రైతుల ఆహ్వానం మేరకే తాము అక్కడికి వెళ్ళామని, జగన్ కానీ వైసీపీ నేతలు కానీ అమరావతి కి వ్యతిరేకం కాదు కానీ అమరావతి పేరుతో చేస్తున్న అవినీతికి మాత్రమే మేము వ్యతిరేకం అంటున్న అవినాష్ కి అమరావతి నిర్మాణానికి భూములిచ్చిన రైతుల ఆవేదన పట్టదా.?
ఇప్పుడు అమరావతి కి భూములివ్వని రైతుల కోసం తాడేపల్లి ప్యాలస్ గేట్లు దాటిన వైసీపీ నేతలు మరి గత ఐదేళ్ల వైసీపీ ప్రభుత్వ హయాంలో అమరావతి నిర్మాణం కోసం భూములిచ్చిన రైతు కుటుంబాలు కన్నీటి రోధనను పట్టించుకున్నారా.? వైసీపీ దృష్టిలో రైతులంటే వైసీపీ కి అనుకూలంగా ఉన్నవారేనా.? లేదా అమరావతి నిర్మాణాన్ని వ్యతిరేకించేవారేనా.?
నేడు పెనుమాక రైతుల కోసం కదిలిన వైసీపీ నాడు అమరావతిలోని ఇతర ప్రాంతాల రైతుల కోసం ఎందుకు ముందుకు రాలేకపోయింది.? ఇదేనా కులం చూడం, మతం చూడం, ప్రాంతం చూడం అంటూ జగన్ చెప్పే నినాదాల పరమార్ధం.? నేడు పెనుమాక రైతుల ను కూటమి ప్రభుత్వం వేధిస్తుంది అంటూ రోడ్డెక్కిన వైసీపీ నాడు అమరావతిలోని మిగిలిన ప్రాంతాల రైతులను చిత్రహింసహలకు గురి చెయ్యలేదా.?




