ఏపీ మద్యం కుంభకోణం కేసులో నిన్న హైదరాబాద్లో ఓ ఫామ్హౌసులో రూ.11 కోట్లు నగదు పట్టుబడిన సంగతి తెలిసిందే. దీనిపై టీడీపి సీనియర్ నేత, ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. “ఈ వ్యవహారంలో పాల్గొన్నవారికి, ఈ కేసు గురించి తెలుసున్నవారికి బయటకు వచ్చి రహస్యాలు బయటపెట్టాలనే ఉంది. కానీ జగన్ హత్యా రాజకీయాలు చేస్తారు కనుక భయపడి ఎవరూ ధైర్యంగా ముందుకు రావడం లేదు.
అయినప్పటికీ సిట్ అధికారులు లోతుగా విచారణ జరిపి ఇప్పటికే అనేక బలమైన సాక్ష్యాధారాలు సంపాదించారు. పలువురిని అరెస్ట్ చేసి ప్రశ్నిస్తున్నారు. ఆ విధంగానే నిన్న హైదరాబాద్ ఫామ్హౌసులో లో రూ.11 కోట్లు ‘నగదు డంప్’ పట్టుబడింది.
సిట్ అధికారులు రైడ్స్ చేయడం మొదలుపెట్టగానే ‘నగదు డంప్’లను హడావుడిగా రహస్య ప్రదేశాలకు మార్చేస్తున్నారు. కానీ వాళ్ళు ఏమార్చాలని ఎంత ప్రయత్నించినా తప్పకుండా ఈ కేసులో అంతిమ లబ్దిదారు జగన్మోహన్ రెడ్డితో సహా ప్రతీ ఒక్కరినీ అరెస్ట్ చేస్తాము.
డిల్లీ మద్యం కుంభకోణం కేసు వంద కోట్లు మాత్రమే. దానిలోనే అంతమందిని అరెస్టులు చేసినప్పుడు మూడు వేల కోట్లు లేదా ముప్పై వేల కోట్ల మద్యం కుంభకోణం కేసులో నిందితులను విడిచిపెడతామనుకోవద్దు. తప్పనిసరిగా అంతిమ లబ్దిదారు జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేస్తాం. తిన్న అవినీతి సొమ్మంతా కక్కిస్తాం. రాజమండ్రి సెంట్రల్ జైలుకి పంపిస్తాం,” అని బుచ్చయ్య చౌదరి అన్నారు.
టీడీపిలో అత్యంత సీనియర్ నాయకులలో ఒకరైన బుచ్చయ్య చౌదరి ఈ మాట చెప్పారంటే జగన్ని అరెస్ట్ చేయడం ఖాయమైనట్లే… చేశాక రాజమండ్రి సెంట్రల్ జైలు పంపడం కూడా ఖాయమైనట్లే అనుకోవచ్చు.
కానీ ఎప్పుడు ముహూర్తం అనేది ఇంకా తెలియాల్సి ఉంది. 2023, సెప్టెంబర్ 9న చంద్రబాబు నాయుడుని జగన్ ప్రభుత్వం అరెస్ట్ చేసింది కనుక జగన్కి కూడా అప్పుడే ముహూర్తం పెట్టారా లేక మరేదైనా ప్రత్యేక ముహూర్తం ఖరారు చేశారా?అనేది ఇంకా తెలియవలసి ఉంది.






