ఏపీ మద్యం కుంభకోణం కేసులో వేలకోట్లు చేతులు మారాయని, అవినీతి జరిగిందని, ఈ కేసులో అంతిమ లబ్దిదారు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డే అని ఏసీబీ దాఖలు చేసిన ప్రాధమిక ఆభియోగ పత్రంలో పేర్కొంది.
కానీ ఇదో భూటకపుకేసని, తమపై రాజకీయ కక్షసాధించేందుకే ఈ కేసుని సృష్టించారని జగన్తో సహా వైసీపీ నేతలందరూ వాదిస్తున్నారు. ఎందువల్ల అంటే, ఈ కేసుని రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో పనిచేసే ఏసీబీ దర్యాప్తు చేస్తున్నందునే!
అదే… ఈ కేసుని సీబీఐకి అప్పగించేస్తే ప్రధాని మోడీపై వైసీపీ నేతలు ఇటువంటి ఆరోపణలు చేయగలరా?ఈవిదంగా ఎదురుదాడి చేయగలరా?అంటే కాదని అందరికీ తెలుసు.
ఈ కేసులో వేలకోట్ల అవినీతి జరిగింది. కనుక ఈ కేసులో ఈడీ కూడా జోక్యం చేసుకోవచ్చు లేదా రాష్ట్ర ప్రభుత్వమే ఈ కేసులో ఈడీని విచారణ చేయమని కోరవచ్చు. ఒకవేళ కోరితే అప్పుడు జగన్ & కో ఈడీని నిందించగలరా?అంటే కాదనే అందరికీ తెలుసు.
డిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఈడీ అధికారులు హైదరాబాద్ వచ్చి కల్వకుంట్ల కవితని అరెస్ట్ చేసి డిల్లీ తీసుకుపోతుంటే, ఆమెను 6 నెలలు తీహార్ జైల్లో పెడితే కేసీఆర్, బీఆర్ఎస్ పార్టీ నేతలు ఏమీ చేయలేకపోయారు.
పైగా తనని కాపాడుకోవడానికి బీఆర్ఎస్ పార్టీని బీజేపిలో విలీనం చేసేందుకు కూడా తన తండ్రి కేసీఆర్ సిద్దపడ్డారనే విషయం కల్వకుంట్ల కవిత స్వయంగా బయటపెట్టారు.
కూటమి ప్రభుత్వంలో బీజేపి భాగస్వామిగా ఉంది. అలాగే కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వంలో టీడీపి భాగస్వామిగా ఉంది. కనుక ఈ మద్యం కుంభకోణం కేసుని సీబీఐ, ఈడీలకు అప్పగించడానికి అభ్యంతరం ఉండకపోవచ్చు.
కనుక ఒకవేళ సిఎం చంద్రబాబు నాయుడు ఈ కేసుని సీబీఐ, ఈడీలకి అప్పగించేస్తే జగన్, వైసీపీ పరిస్థితి కూడా ఇలాగే మారుతుంది… అని ఇంకా గ్రహించలేదు.
కనుక ఈ మద్యం కుంభకోణం కేసు ఏపీ ప్రభుత్వం చేతిలో ఉన్నంత వరకే తాము ఆడింది ఆట పాడింది పాట అన్నట్లు సాగుతుందని, ఒకవేళ సీబీఐ, ఈడీ చేతుల్లోకి వెళిపోతే తామే ప్రమాదంలో పడతామని వైసీపీ నేతలు ఇంకా గ్రహించినట్లు లేదు. అందుకే ఇంతగా రెచ్చిపోతున్నారనుకోవచ్చు.




