ఓ థ్రిల్లర్ లేదా సస్పెన్స్ సినిమా కధ వ్రాసుకునేటప్పుడు దర్శకుడు చాలా జాగ్రత్తలు తీసుకుంటాడు. సినిమా చివరి వరకు సస్పెన్స్ కొనసాగిస్తూ ప్రేక్షకులను కుర్చీలలో నుంచి కదలకుండా కూర్చోబెట్టేవిదంగా కధ నడిపిస్తాడు.
ఏపీ సిఎంగా తొలిసారిగా బాధ్యతలు చేపట్టిన జగన్ కూడా ఎంతో అనుభవం ఉన్న దర్శకుడిలా మద్యం కుంభకోణానికి రూపకల్పన చేసి ఎక్కడా ఒక లొసుగు లేకుండా 5 ఏళ్ళపాటు విజయవంతంగా అమలు చేశారు!
రూ.250 పించన్ పెంపుకి ఏడాది చొప్పున గడువు పెట్టి 5 ఏళ్ళలో రూ.3,000కి చేర్చిన జగన్, మద్యం కుంభకోణం విషయంలో ఏమాత్రం ఆలస్యం చేయలేదు. ఎన్నికలలో వైసీపీ గెలిచిన వెంటనే మొదలైంది. అంటే ఈ విషయంలో జగన్కి ఎంత దూరదృష్టి ఉందో అర్ధమవుతుంది.
ఇదే తెలివితేటలు, ప్లానింగ్, నిబద్దత ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి విషయంలో చూపించి ఉండి ఉంటే నేడు రాష్ట్రం ఎక్కడో ఉండేది. జగన్ పేరు దేశమంతా మారుమ్రోగిపోయేది. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ పేర్లు మరుగున పడిపోయి ఉండేవి.
కానీ జగన్ అణుబాంబు లాంటివారు! అది ఎక్కడ పడితే అక్కడ విధ్వంసం తప్పదు. జగన్ దెబ్బకి వైసీపీ కూడా అలాగే విధ్వంసం అయ్యింది కదా?
మద్యం కుంభకోణం విషయానికి వస్తే, దాని గురించి మీడియాలో వస్తున్న వివరాలు సామాన్య ప్రజలకు అర్దమవవంటే అతిశయోక్తి కాదు.
ఇస్రో శాస్త్రవేత్తలు ఒక ఉపగ్రహాన్ని తయారు చేయడానికి, తర్వాత దానిని అంతరిక్షంలో ప్రవేశపెట్టడానికి ఎంత సునిశితంగా ప్రతీదీ ప్లాన్ చేసుకుంటారో జగన్ కూడా మద్యం కుంభకోణాన్ని అంతే ‘ప్రెసిషన్’గా ప్లాన్ చేసి అమలుచే రోల్ మోడల్గా నిలిచారు.
మద్యం కుంభకోణంలో ‘బంగారం కధలు’ విన్నప్పుడు పానకంలో పుడకలా అనిపించవచ్చు. కానీ అవి ఆర్ధిక నిపుణులు సైతం ఊహించలేని ఆలోచనలే. నిజానికి ఇంత సంక్లిష్ట పద్దతిలో మద్యం కుంభకోణం చేయాలనే ఆలోచన కూడా చాలా గొప్పదే.
అందువల్లే టీవీ న్యూస్లో మద్యం కుంభకోణం కేసుకి సంబందించి వార్తలు వస్తున్నప్పుడు చాలామంది ఛానల్ మార్చేస్తారు. అవి చాలా గందరగోళంగా అనిపిస్తే, ఈ కేసులో ఎవరినైనా అరెస్ట్ చేస్తే అది మాత్రం అందరికీ కనిపిస్తుంది. అలాగే ‘రాజకీయ కక్ష సాధింపు’ అంటూ వైసీపీ నేతలు సింపుల్గా చెపుతున్న మాటలు ప్రజలకు బాగా చేరుతున్నాయి.
కాకినాడ పోర్టు నుంచి షిప్పులో రేషన్ బియ్యం అక్రమ రవాణా చేసినట్లు ఈ కేసులో ఏదీ కళ్ళకు కనపడదు…. వైసీపీ నేతల అరెస్టులు …. వారి ఖండనలు తప్ప.
కనుక ఏసీబీ అధికారులు దీనిపై ఎంత లోతుగా దర్యాప్తు జరిపినప్పటికీ వారు కూడా వేల పేజీలతో ఆభియోగ పత్రాలు వేయకతప్పడం లేదు. కనుక కనుక ఈ కేసులో సంక్లిష్టత కూడా భాగమే. ఈ సంక్లిష్టతే వాదోపవాదాలకు, కౌంటర్ పిటిషన్లకు మరింత ఉపయోగపడుతుంది.
అంటే ఈ మద్యం కుంభకోణం ప్లానింగ్ దశలోనే జగన్ & కో ఒకవేళ ఈ కేసు కోర్టుకి వెళితే దీనిని ఏవిదంగా సాగదీయాలనే విషయం కూడా ఆలోచారన్న మాట!
కనుక అక్రమాస్తుల కేసు, వివేకా హత్య కేసులాగే ఈ మద్యం కుంభకోణం కేసుని కూడా న్యాయ విద్యార్ధులు ఓ కేసు స్టడీగా తీసుకొని అధ్యయనం చేస్తే వారికి తమ గురువులు కూడా చెప్పని పాఠాలు ఎన్నో ఈ మూడు కేసులలోనే లభిస్తాయి.
మొదటి అణుబాంబు తయారుచేసిన శాస్త్రవేత్త (జె. రాబర్ట్ ఓపెన్ హైమర్) గురించి చాలా మందికి తెలియకపోవచ్చు. కానీ అది ఎప్పుడు ఎక్కడ వేశారో అందరికీ తెలుసు.
అదేవిదంగా ఈ కేసులో ప్రధాన శాస్త్రవేత్తని కనిపెట్టడం చాలా కష్టం కావచ్చు కానీ ఈ కేసు గురించి నాలుగు తరాలు తప్పకుండా చెప్పుంటాయి.




