సంక్షేమ పధకాలకు నిధులను సమకూర్చుకొనేందుకు వైసీపీ ప్రభుత్వం అదనపు ఆదాయ మార్గాల కోసం అన్వేషిస్తుండగా దాని దృష్టి సినిమా టికెట్ల అమ్మకాలపై పడింది. దాంతో ఏపీఎస్ ఎఫ్టీవీ టిడిసి ఏర్పాటు చేస్తున్న సంస్థ ద్వారానే ఆన్లైన్లో టికెట్లు అమ్మాలని సినిమా థియేటర్లపై ఒత్తిడి చేస్తోంది. దీనికోసం రాష్ట్రంలోసినిమా థియేటర్ల యజమానులందరూ ఏపీఎస్ ఎఫ్టీవీ టిడిసితో తప్పనిసరిగా ఒప్పందాలు చేసుకోవాలని లేకుంటే భారీ జరిమానాలు విధించడమే కాకుండా థియేటర్లు మూసివేయిస్తామని అధికారులు బెదిరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
నగరాలు, పెద్ద పట్టణాలలో ప్రజలకైతే ఆన్లైన్లో టికెట్లు కొనుకొని సినిమాలు చూసే అలవాటు ఉంటుందని, కానీ చిన్న పట్టణాలు, గ్రామీణ ప్రాంతాలలోని బీ,సీ సెంటర్లలో కూడా ఆన్లైన్లో టికెట్స్ కొనాలని నిబందన విధిస్తే థియేటర్స్కు ప్రేక్షకులు రావడం తగ్గిపోతుందని అంటున్నారు.
నేటికీ కరోనా దెబ్బకు కోలుకోలేకపోతున్నామని ఈ సమయంలో రాష్ట్ర ప్రభుత్వం ఇటువంటి చిత్రవిచిత్రమైన ఆలోచనలు చేసి వాటిని తమపై బలవంతంగా తమపై రుద్దాలని ప్రయత్నిస్తే ఇక థియేటర్లు మూసుకోక తప్పదని వాటి యజమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
థియేటర్ల యజమానుల బాధలు ఈవిదంగా ఉంటే, ఆన్లైన్లో సినిమా టికెట్స్ అమ్మే సంస్థలు బాధలు మరోలా ఉన్నాయి. ప్రభుత్వ నిర్ణయంతో తాము తీవ్రంగా నష్టపోతామని బిగ్ట్రీ ఎంటర్టైన్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ డెప్యూటీ జనరల్ మేనేజర్ సందీప్ అన్నోజ్వాలా అన్నారు.
ఆన్లైన్లో ఒక్కో టికెట్ విక్రయించినందుకు థియేటర్ యజమానులు రూ.2 చొప్పున చెల్లిస్తుంటారని, ఇప్పుడు దానిలో రూ.1.97 సర్వీసు ఛార్జీగా ప్రభుత్వానికి చెల్లిస్తే ఇక తమకు మిగిలేది 3 పైసలు మాత్రమే అని, దాంతో తమ వంటి ఆన్లైన్ సంస్థలు ఏవిదంగా మనుగడ సాగించగలవని ప్రశ్నించారు.
కనుక ప్రభుత్వ నిర్ణయాన్ని సవాలు చేస్తూ బిగ్ట్రీ ఎంటర్టైన్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ తరపున సందీప్ అన్నోజ్వాలా హైకోర్టులో పిటిషన్ వేశారు. ఇప్పటికే మల్టీప్లెక్స్ థియేటర్స్ యజమానులు కూడా ప్రభుత్వ నిర్ణయాన్ని సవాలు చేస్తూ పిటిషన్ వేశారు. కనుక రెంటినీ కలిపి ఒకేసారి విచారణ జరుపుతామని చెపుతూ ఈ కేసును ఈ నెల 27వ తేదీకి వాయిదా వేసింది.



