కూటమి పై సామాన్యుడి ఆగ్రహం…

AP People Angry On TDP JSP Alliance

వై నాట్ 175 అనే వైసీపీ ఎన్నికల నినాదం రాష్ట్రంలోని అప్పటి ప్రతిపక్ష పార్టీలైన టీడీపీ, జనసేన లను కూడా ఆందోలనకు గురిచేసింది. అయితే వైసీపీ అత్యాశను, టీడీపీ, జనసేనల ఆందోళనలను తమ ఓటు అనే ఆయుధంతో దూరం చేసారు ఏపీ సామాన్య ప్రజానీకం.

బటన్లు నొక్కడం కాదు భద్రత కలిగిన సమాజం కావాలి, పథకాలు పంచడం కాదు భరోసా ఇచ్చే ప్రభుత్వం ఉండాలి, పరదాల నాయకుడు కాదు అందుబాటులో ఉండే నాయకులు రావాలి, అరాచకం కాదు రాష్ట్రంలో అభివృద్ధి జరగాలి, వలసలు కాదు ఉపాధి అందించే నాయకత్వం అవసరం. ఈ ఆలోచనలే సామాన్య ప్రజానీకాన్ని కూటమి వైపుకి లాక్కొచ్చాయి.

ADVERTISEMENT

అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి నేటి వరకు అభివృద్ధి, సంక్షేమం విషయంలో సంతృప్తిగా ఉన్న ప్రజలు మరో విషయంలో మాత్రం కూటమి చర్యలతో అసహనానికి గురవుతున్నారు.

అది వైసీపీ ని కట్టడి చేయడంలో, వైసీపీ నాయకులను అదుపులో పెట్టడం. ఈ రెండు విషయాలలో కూటమి ప్రభుత్వం కనీసం పార్టీ క్యాడర్ నే కాదు సామాన్య ప్రజానీకాన్ని కూడా సంతృప్తి పరచలేకపోయింది.

వైసీపీ, పార్టీ పరంగా ఓడినప్పటికీ భౌతికంగా ఇప్పటికి కూటమి కంటే వైసీపీ నే పై చేయి సాధిస్తుంది. కనీసం ప్రజలు వైసీపీ కి ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదు, కానీ కూటమి ప్రభుత్వం తన అలసత్వం తో వైసీపీ 2.0 ని రాష్ట్రానికి పరిచయం చేస్తుంది.

అధినేత చూస్తే పర్యటనల పేరుతో బలప్రదర్శనలు చేస్తూ అలజడి వాతావరణాన్ని సృష్టిస్తున్నారు. పార్టీ క్యాడర్ చూస్తే రప్ప రప్ప నరుకుతాం అంటూ బెదిరింపులకు దిగుతూ అశాంతిని ప్రోత్సహిస్తున్నారు. ఇక పార్టీ నాయకుల సంగతికి వస్తే సైలెంట్గా పని కానిచ్చేయాలి కానీ ఇలా అరుపులేందుకు అంటూ హింసకు అధికార ముద్ర వేస్తూ ప్రసంగాలు చేస్తున్నారు.

ఇలా పార్టీ క్యాడర్ నుంచి లీడర్ల వరకు అందరు అధికారులను భయపెడుతూ, ప్రభుత్వాన్ని బెదిరిస్తూ, చంపుతాం, నరుకుతాం, తొక్కుకుంటూ పోతాం అంటూ రెచ్చిపోతుంటే ప్రభుత్వం కేసులు పెట్టి చేతులు దులుపుకుంటుందే తప్ప అటువంటి ఘటనలు తిరిగి పునరావృత్తం కాకుండా చేయలేకపోతోంది.

ఇలా అయితే అటు రాష్ట్రంలో సామాన్యుడికి భద్రత దొరికినట్టేనా.? పారిశ్రామిక వేత్తకు భరోసా అందినట్టేనా.? గత ఐదేళ్లు వైసీపీ రెచ్చిపోయింది అంటే అందుకు జగన్ చేతిలో అధికారం అనే అస్త్రం ఆయుధంగా ఉంది. కానీ ఇప్పుడు కూడా వైసీపీ అదే మాదిరి రెచ్చకొడుతుంది అంటే కూటమి చేతిలో ఉన్న అధికారం అనే అస్త్రానికి శక్తి లేనట్టా.?

నాడు టీడీపీ, జనసేన పార్టీల మీద వైసీపీ వేసిన ఉక్కుపాదానికి ప్రజలందరిలో టీడీపీ నిస్సహాయత మీద, జనసేన నిట్టూర్పు మీద సానుభూతి వర్షంలా కురిసింది. అదే వైసీపీ కి శాపంలా మారింది. కానీ నేడు అధికారం చేతిలో ఉంచుకుని కూడా టీడీపీ, జనసేనలు అదే నిస్సహాయత ప్రదర్శిస్తుంటే సామాన్యుడికి కూటమి పట్ల అసహనం వ్యక్తమవుతోంది.

తిరుమల లడ్డు కల్తీ కేసు నుంచి లిక్కర్ స్కాం, జిత్వాని కేసు, వివేకా హత్య కేసు, పెద్ది రెడ్డి, సజ్జల భూదందాల కేసు, ఇసుక మాఫియా, మైనింగ్ మాఫియా ఇలా గత ఐదేళ్ల వైసీపీ పాలనలో కూటమి ప్రభుత్వం వెలుగులోకి తెచ్చిన అనేక కేసులలో ఇప్పటికి ఒక్క కేసులో కూడా పురోగతి సాధించింది లేదు.

దోషులను గుర్తించింది లేదు. అరెస్టులు జరుగుతున్నాయి, జైళ్లకు వెళుతున్నారు, బైళ్ల మీద తిరిగి వస్తున్నారు, వచ్చేది మేమే మీ సంగతి తేలుస్తాం అంటూ హెచ్చరికలు చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ఏ ఒక్క వైసీపీ కార్యకర్తను కూడా భయపెట్టలేకపోతున్నాయి. ఏ ఒక్క వైసీపీ నేతల అరాచవాదాన్ని కూడా కట్టడి చెయ్యలేకపోతున్నాయి.

ఎక్కడి దొంగలు అక్కడే సాంబార్ బడ్ అన్న చిన్న పిల్లల ఆట మాదిరి జగన్ అక్రమాస్తుల కేసు నుంచి కోడికత్తి, గులకరాయి ఇలా ఏ ఒక్క కేసు కూడా ఒక్క అడుగు కూడా ముందుకు సాగలేకపోతుంది. కేసులు పెడతాం, కొన్నాళ్ళు జైల్లో ఉండి వచ్చేయండి అన్న చందంగా మారిపోయాయి కూటమి ప్రభుత్వ కేసులు.

గత ఐదేళ్లు కనీసం ప్రభుత్వ చర్యలను ప్రశ్నించడానికి కూడా భయపడే పరిస్థితిలో ఉన్న ప్రతిపక్షం నేడు పబ్లిక్ గా ఒక వ్యక్తిని కారు కింద తొక్కి చంపేసినా చలనం లేకుండా పోయింది. అలాగే వైసీపీ నాయకులు అరవడం కాదు కరవండి అంటూ బహిరంగా పార్టీ క్యాడర్ ను హింస వైపుకు నెడుతున్నా ప్రభుత్వం చర్యలు శూన్యం.

నాడు వైసీపీ ప్రభుత్వం చేతిలో అధికారం ఉంది అనే అహం తో మితిమీరి ప్రవర్తించింది అనే ఆరోపణలను ఎదుర్కొంటే, నేడు కూటమి ప్రభుత్వం అధికారం చేతిలో పెట్టుకుని కూడా మీనమేషాలు లెక్కిస్తుంది అనే అపవాదును మోస్తుంది.

ADVERTISEMENT
Latest Stories