వివేకా, సుబ్రహ్మణ్యం, కోడి కత్తి కేసులే తేలనప్పుడు…

AP Stalled Cases: Is Justice Delayed

జగన్‌ ముఖ్యమంత్రిగా ఉన్న 5 ఏళ్ళలో వివేకా హత్య కేసు ఎన్ని మెలికలు తిరిగిందో అందరూ చూశారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది. పైగా చంద్రబాబు నాయుడుకి ఇప్పుడు కేంద్రంలో పరపతి పెరిగింది. కనుక ఇక ఈ కేసు విచారణ వేగం పుంజుకుంటుందని అందరూ ఆశిస్తే, ఏడాది గడుస్తున్నా అసలు ఆ ఊసే వినిపించకపోవడం చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది.

జగన్‌ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ కేసుని ముందుకు కదలనీయకుండా అడ్డుకోవడం పెద్ద విచిత్రమేమీ కాదు. కానీ పదవీ, అధికారం కోల్పోయినా, దిల్లీలో చక్రం తిప్పేందుకు ఇప్పుడు విజయసాయి రెడ్డి పార్టీలో లేకపోయినా వివేకా హత్య కేసుకి బ్రేకులు వేసి ఉంచగలగడం ఆశ్చర్యం కలిగిస్తుంది. సీబీఐ, సుప్రీంకోర్టు కూడా ఈ కేసుని మరిచిపోయాయా?అనిపిస్తుంది.

ADVERTISEMENT

ఆరేళ్ళుగా నలుగుతున్న ఈ కేసుని తేల్చలేకపోతున్నప్పుడు కొత్తగా తవ్వితీసిన మద్యం కుంభకోణం కేసు విచారణ మాత్రం పూర్తవుతుందా?జగన్ పూర్తిచేయనిస్తారా?అనే సందేహం కలుగకమానదు.

వివేకా, మద్యం కుంభకోణం కేసులలో అన్నీ పెద్ద తలకాయలే ఉన్నాయి. కనుక ముందుకు సాగకుండా బ్రేకులు పడుతున్నాయని అర్ధం చేసుకోవచ్చు.

కానీ కోడి కత్తి కేసు, కాకినాడ దళిత యువకుడు సుబ్రహ్మణ్యం హత్య కేసులు కూడా ముగియడం లేదు. బహుశః ఈ రెండు కేసులలో బాధితులు దళితులు కావడం వల్లనే ఎవరూ పట్టించుకోవడం లేదేమో?

కానీ ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులను చూసేందుకు ప్రత్యేకంగా ఎస్సీ, ఎస్టీ కోర్టు ఉంది కదా? అయినా దళితులకు ఎందుకు న్యాయం జరుగడం లేదు?

సుబ్రహ్మణ్యం హత్య కేసులో నిందితుడుగా పేర్కొనబడిన వైసీపీ ఎమ్మెల్సీ అనంత బాబు ఓ ఆర్నెల్లు జైల్లో ఉండి బెయిల్‌పై బయటకు వచ్చేసి రెండేళ్ళు అవుతోంది. అప్పటి నుంచి దర్జాగా బయట తిరుగుతూనే ఉన్నారు.

సుబ్రహ్మణ్యం తల్లితండ్రుల అభ్యర్ధన మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఈ కేసు విచారణలో బాధిత కుటుంబానికి తోడ్పడేందుకుప్రముఖ న్యాయవాది ముప్పాళ్ళ సుబ్బారావుని నియమించింది. కనుక ఇప్పుడు ఈ కేసులో చిన్న కదలిక వచ్చింది.

సుబ్బారావు అభ్యర్ధన మేరకు న్యాయస్థానం ఈ కేసుపై 90 రోజులలో సమగ్ర విచారణ జరిపి అనుబంధ ఛార్జ్ షీట్ దాఖలు చేయాలని పోలీసులను (సిట్) ఆదేశించింది. కనీసం ఇప్పటికైనా ఈ కేసులో కదలిక వచ్చినందుకు సంతోషమే. కానీ మిగిలిన కేసుల్లాగే దీనినీ విచారణ, వాయిదాలతో సాగదీసుకుపోతారేమో?

ADVERTISEMENT
Latest Stories