లోకేశ్‌ రాకపోతే రప్పిస్తాం.. లోపల వేస్తాం… తగ్గేదేలే!

Nara Lokeshటిడిపి అధినేత చంద్రబాబు నాయుడుని అరెస్ట్ చేసి నేటికీ 22 రోజులైంది. ఆయన బెయిల్ కోసం చేసిన ఏ ప్రయత్నమూ ఫలించడం లేదు. ఒకవేళ ఫలించినా ఆయనను మళ్ళీ లోపలకి పంపేందుకు ఏపీ సీఐడీ వరుసపెట్టి కేసులు వేస్తూనే ఉంది.

చంద్రబాబు నాయుడుని ఇన్నిరోజులుగా జైల్లో ఉంచినా టిడిపి ఏమీ చేయలేకపోవడం, కేంద్ర ప్రభుత్వం స్పందించకపోవడంతో వైసీపి ప్రభుత్వానికి మరింత ఉత్సాహం వచ్చిన్నట్లుంది. ఇప్పుడు టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ను అరెస్ట్ చేసి జైలుకి పంపించేందుకు రంగం సిద్దం చేస్తోంది. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో నారా లోకేశ్‌కు ఏపీ సీఐడీ నోటీస్ ఇచ్చారు.

ADVERTISEMENT

నారా లోకేశ్‌ ఢిల్లీ నుంచి విజయవాడకు వస్తే అరెస్ట్ చేద్దామని ఇంతకాలం ఎదురుచూసిన ఏపీ సీఐడీ పోలీసులు, ఆయన ఎంతకూ రాకపోవడంతో శనివారం ముగ్గురు అధికారులు ఢిల్లీ చేరుకొని టిడిపి ఎంపీ గల్లా జయదేవ్ ఇంట్లో ఉంటున్న నారా లోకేశ్‌కు స్వయంగా నోటీసులు అందించారు. అంతకు ముందు వాట్సప్ ద్వారా కూడా ఆయనకు నోటీస్ పంపించారు.

సెక్షన్ 41ఏ ప్రకారం ఇచ్చిన ఆ నోటీసులో అక్టోబర్ 4వ తేదీ ఉదయం 10 గంటలకు తాడేపల్లిలోని సమృద్ధి నెక్సా అపార్ట్‌మెంట్‌లో గల తమ కార్యాలయంలో విచారణకు హాజరు కావలసిందిగా ఆదేశించారు.

ఏపీ సీఐడీ పోలీసులు తనను అరెస్ట్ చేసేందుకు సిద్దంగా ఉన్నారని నారా లోకేశ్‌ గ్రహించడంతో ఏపీ హైకోర్టులో ముందస్తు బెయిల్ కోరుతూ ఓ పిటిషన్ వేశారు. కానీ హైకోర్టు తిరస్కరించింది. అయితే అక్టోబర్ 4వరకు నారా లోకేశ్‌ని అరెస్ట్ చేయవద్దని సూచించింది. కానీ అంతవరకు కూడా ఆగలేన్నట్లు ఏపీ సీఐడీ అధికారులు ఢిల్లీకి వెళ్ళి నారా లోకేశ్‌కు నోటీస్ అందించడం గమనిస్తే వైసీపి ప్రభుత్వం ఆయనను కూడా అరెస్ట్ చేసి జైలుకి పంపేందుకు ఎంత ఆతృతగా ఉందో అర్దం చేసుకోవచ్చు.

చంద్రబాబు నాయుడు అరెస్టుపై మోడీ, అమిత్ షాలు స్పందించకపోయి ఉండవచ్చు. కానీ దేశంలో పలువురు ప్రముఖ నేతలు, వివిద రంగాలకు చెందినవారు ఖండిస్తునే ఉన్నారు. అయినా వైసీపి ప్రభుత్వం ఏమాత్రం తగ్గడం లేదు. టిడిపి ముఖ్యనేతలందరిపై కేసులు నమోదు చేసి జైలుకి పంపించేసి, ఎన్నికల సమయానికి టిడిపిని పూర్తిగా బలహీనపరచాలని భావిస్తున్నట్లుంది.

ADVERTISEMENT
Latest Stories