హైదరాబాదు చుట్టూ విస్తరించి ఉన్న ఔటర్ రింగు రోడ్డు మరోసారి నెత్తురోడింది. విజయవాడ నుంచి హైదరాబాద్ వస్తుండగా తుక్కుగూడ దగ్గర జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఏపీ ఆప్కాబ్ చైర్మన్ పిన్నమనేని వెంకటేశ్వరరావు ప్రయాణిస్తున్న కారు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో పిన్నమనేనికి తీవ్ర గాయాలు కాగా… ఆయన సతీమణి సత్యవాణి, కారు డ్రైవర్ దాసు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. గాయపడ్డ పిన్నమనేనిని పోలీసులు హుటాహుటిన జూబ్లీహిల్స్ ఆసుపత్రికి తరలించగా, మృతదేహాలను ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.
ఈ సమాచారం తెలుసుకున్న ఆంధ్రప్రదేశ్ మంత్రులు పల్లె రఘునాథరెడ్డి, కామినేని శ్రీనివాస్ లు వెనువెంటనే ఘటనపై పూర్తి వివరాలు అడిగి తెలుసుకున్నారు. పిన్నమనేని చికిత్స పొందుతున్న అపోలో ఆసుపత్రి వైద్యులకు ఫోన్ చేసిన ఇద్దరు మంత్రులూ ఆరోగ్య పరిస్థితిపై వాకబు చేసారు. పిన్నమనేనికి మెరుగైన వైద్యం అందించాలని, త్వరగా కోలుకునేలా చర్యలు తీసుకోవాలని వైద్యులకు సూచించారు. పిన్నమనేని సతీమణి మృతి పట్ల మంత్రులు తమ ప్రగాఢ సంతాపాన్ని ప్రకటించారు.
యాక్సిడెంట్లకు నిలయంగా మారుతున్న ఔటర్ రింగ్ రోడ్ లో ప్రధానంగా రాజకీయ కుటుంబాలు, సినీ సెలబ్రిటీలకు చెందిన కుటుంబ సభ్యులే బలవుతుండడం గమనించదగ్గ విషయం. అయితే అన్ని ప్రమాదాలకు కారణం మాత్రం మితిమీరిన వేగమేనని తెలుస్తోంది. ఔటర్ పై అత్యంత వేగంతో ప్రయాణించే వాహనాలకు, మధ్యలో ఏ చిన్న అడ్డు వచ్చినా చివరికి అది పెను ప్రమాదంగా మారుతోంది. తాజాగా జరిగిన ఘటనలో కూడా పిన్నమనేని ప్రయాణిస్తున్న కారు దాదాపుగా 150 కిలోమీటర్ల వేగంతో వెళ్తున్నట్లుగా తెలుస్తోంది. అందుకే మూడు పల్టీలు కొట్టగా, సీట్ బెల్ట్ పెట్టుకోవడం వలన పిన్నమనేనికి ప్రాణాపాయం తప్పినట్లుగా ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.



