మరో 5 రోజులలో అంటే ఆగస్ట్ 15 నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు ఆర్టీసీ బస్సులలో ‘స్త్రీశక్తి’ పేరిట ఉచిత ప్రయాణ సౌకర్యం మొదలవుతుంది.
దీనికి సంబంధించి అన్ని వివరాలు ప్రభుత్వం ఒకేసారి వెల్లడించి ఉంటే విమర్శలకు, అపోహలకు తావు ఉండేది కాదు. కానీ వైసీపీ వేలెత్తి చూపుతూ దీనిపై కూడా నీచ రాజకీయాలు చేసేందుకు అవకాశం కల్పించింది.
ఈ పధకం అమలుకి సమయం దగ్గర పడుతుండటంతో మరికొన్ని వివరాలు వెల్లడించింది.
ఏపీఎస్ ఆర్టీసీకి అన్ని రకాల బస్సులు కలుపుకొని మొత్తం 11,449 బస్సులు ఉండగా వాటిలో 74 శాతం అంటే 8,458 బస్సులలో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తోంది.
దీనిపై వైసీపీ ఎప్పటిలాగే విమర్శలు చేస్తున్నప్పటికీ, ఏపీ ప్రభుత్వం చాలా తెలివైన నిర్ణయం తీసుకొందని చెప్పవచ్చు. రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తూనే, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, ఒడిశా, మహారాష్ట్రలకు ప్రయాణించే బస్సులను, ముఖ్యంగా ఆర్టీసీకి భారీగా ఆదాయం సమకూరే ఏసీ, సూపర్ లగ్జరీ బస్సులను దీని నుంచి మినహాయించడం చాలా తెలివైన నిర్ణయమే. లేకుంటే వాటి ద్వారా వచ్చే ఆదాయం కోల్పోవడంతో పాటు ప్రభుత్వం, ఆర్టీసీపై భారీగా భారం పడుతుంది.
ఘాట్ రోడ్లలో తిరిగే బస్సులలో కూడా ఈ పధకం వర్తింపజేయకూడదనే నిర్ణయం సహేతుకమే. వాటిలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తే బస్సుల సామర్ధ్యానికి మించి మహిళా ప్రయాణికులు ప్రయాణిస్తారు. ఆ కారణంగా ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది కనుక ఘాట్ రోడ్లలో తిరిగే బస్సులని ఈ పధకానికి వర్తింపజేయలేదు.
ఈ పధకం వలన రాష్ట్ర ప్రభుత్వంపై ఏడాదికి రూ. 1,942 కోట్లు భారం పడుతుందని అధికారులు అంచనా వేశారు. ఇటువంటి భారీ, దీర్గకాళిక పధకాలు అమలుచేస్తున్నప్పుడు ఇటువంటి దూరదృష్టి, ముందస్తు జాగ్రత్తలు చాలా అవసరమే.







