పెళ్ళి అనేది బంగారు పంజరం వంటిది. బయట ఉన్నవారు దానిలో ప్రవేశించాలని ఉబలాటపడుతుంటే, లోపల చిక్కుకున్నవారు దానిలో నుంచి బయటపడాలని ప్రయత్నిస్తుంటారని ఓ ప్రముఖ కవి అన్నారు. ఆయన మాటలు అక్షరాల నిజమని నిరూపిస్తున్నాయి సినీ పరిశ్రమలో జోరుగా అవుతున్న పెళ్ళిళ్ళు, విడాకులు.
నాగ చైతన్య-శోభిత ధూళిపాళ, కీర్తి సురేష్-ఆంటోనీ ఇంకా చాలా మంది పెళ్ళి పీటలు ఎక్కేందుకు జోరుగా ఏర్పాట్లు చేసుకుంటుంటే, ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రహమాన్, సైరాభానుదంపతులు 29 ఏళ్ళు కాపురం చేసిన తర్వాత విడాకులు తీసుకుంటున్నట్లు బాంబు పేల్చారు. కోలీవుడ్లోనే ధనుష్-ఐశ్వర్య దంపతులు విడాకులు తీసుకోగా, జయం రవి-ఆర్తి దంపతుల విడాకుల కేసు ముగింపు దశకు చేరుకుంది. ఇప్పుడు ఏఆర్ రహమాన్, సైరాభాను దంపతులు కూడా విడాకుల జాబితాలో చేరారు.
సినీ రంగంలో పెళ్ళిళ్ళు ఎంత అట్టహాసంగా జరుగుతాయో, విడాకులు కూడా అంతే వివాదాలను సృష్టిస్తుంటాయి. ఇండస్ట్రీలో పరిచయాలు, అలవాట్లు, పనివేళలు వంటివి వారి వైవాహిక జీవితాలపై తీవ్ర ప్రభావం చూపుతుంటాయి. బహుశః ఏఆర్ రహమాన్, సైరాభానుదంపతులు కూడా ఇటువంటి కారణాలతోనే విడిపోతున్నారేమో?
దీనికి రాజమౌళి మినహాయింపు అని చెప్పవచ్చు. ఇటువంటి సమస్యలు ఏవీ ఉత్పన్నం కాకుండా కుటుంబంలో ప్రతీ ఒక్కరూ ఆయన సినిమాలలో ఏదో పనితో బిజీగా ఉంటారు. కానీ అందరికీ అటువంటి అవకాశం ఉండదు కనుక కొన్ని వివాహ బంధాలు 20-30 ఏళ్ళ తర్వాత సినీ కారణాలతో విచ్ఛిన్నం అవుతుండటం చూస్తున్నాము.
ఏఆర్ రహమాన్, సైరాభాను దంపతులకు ఒకరిపై మరొకరి ప్రేమ, గౌరవం ఉన్నాయని కానీ కొన్ని భావోద్వేగపూరితమైన ఒత్తిళ్ళ కారణంగా వారి మద్య సమస్యలు ఉత్పన్నం అవుతుండటంతో పరస్పర అంగీకారంతో ఇద్దరూ విడిపోతున్నారని ఆమె తరపు న్యాయవాది తెలిపారు.
తన అపూర్వమైన సంగీతంతో దేశ ప్రజలందరిని అలరించి వారి అభిమానం, ఆదరణ పొందిన ఏఆర్ రహమాన్ ఇంట్లో భార్య నుంచి పొందలేక విడిపోవలసి వస్తుండటం చాలా బాధాకరమే. అదీ… 29 ఏళ్ళ కాపురం చేసిన తర్వాత అంటే ఇంకా చాలా చాలా బాధాకరమే. ఏఆర్ రహమాన్ కుటుంబంలో ఈవిదంగా జరగడం చూసి అభిమానులు బాధపడుతూనే ఉన్నారు. కానీ వారిరువురూ ఆ బంగారు పంజరం తమకి వద్దనుకున్నప్పుడు అందరూ అంగీకరించాల్సిందే.




