ఉభయ గోదావరి జిల్లాలతో పాటు విజయనగరం జిల్లాలలో ‘క్లీన్ స్వీప్’ దిశగా దూసుకుపోతున్న వైఎస్సార్సీపీ తన ఖాతాను సాగర తీర నగరం విశాఖ జిల్లాలోనూ ఓపెన్ చేసింది. జగన్ పార్టీ టికెట్ పై పోటీ చేసి విజయం సాధించిన అరకు ఎమ్మెల్యే సర్వేశ్వరరావు తాజాగా ఇచ్చిన ‘ట్విస్ట్’ విశాఖ వైసీపీలో కల్లోలానికి కారణమైంది.
తన నియోజకవర్గపు అభివృద్ధి కోసం తానూ వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరబోతున్నట్లుగా స్పష్టం చేసారు. కార్యకర్తలు కూడా చంద్రబాబు వైపుకే ఉన్నారని, నిజానికి చాలా కాలం నుండి ఈ దిశగా కార్యకర్తలు ఒత్తిడి తీసుకువస్తున్నారని తెలిపిన అరకు ఎమ్మెల్యే ఈ నెల 28వ తేదీన టిడిపి కండువా కప్పుకోబోతున్నట్లు ప్రకటన చేసారు.
ఇటీవల కాలంలో పార్టీ మారుతున్న వారిని బుజ్జగించేందుకు జగన్ తన పార్టీ ముఖ్య నేతలైన చెవిరెడ్డి వంటి వారిని రంగంలోకి దించినా ఫలితం లేకపోయింది. దీంతో ఈ సారి అలాంటి ప్రయత్నాలు కూడా జగన్ విరమించుకున్నట్లుగా కనపడుతోంది. దాదాపుగా ప్రతి రోజు ఏదొక పేరు వెలుగు చూస్తుండడంతో “నెక్స్ట్ ఎవరు?” అన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది.



