ఇన్నాళ్లు రాజధాని లేని రాష్ట్రంగా ఢిల్లీ పార్లమెంట్లో మారుమోగిన ఏపీ పేరు నేటి నుంచి అరకు కాఫీ రుచితో పార్లమెంట్ ప్రాంగణంలో ఘుమఘుమలు విరజిమ్మబోతుంది. స్పీకర్ ఓం బిర్లా అనుమతితో లోక్ సభ భవనాల డైరెక్టర్ కుల్ మోహన్ సింగ్ ఉతర్వుల మేరకు ఢిల్లీ పార్లమెంట్ ఆవరణలో రెండు అరకు కాఫీ స్టాల్స్ అందుబాటులోకి రానున్నాయి.
అల్లూరి సీతారామరాజు జిల్లాలో భాగమైన ఈ అరకు మన్యం ప్రాంతం మంచి టూరిజం స్పాట్ గా ఏపీలో ప్రసిద్ధి చెందింది. ట్రైబల్స్ సంచారమైన అరకు వ్యాలీ మినీ ఊటీగా పేరు గడించింది. ఇక్కడి ప్రకృతి అందాలు, పచ్చదనం పర్యటకులకు నేత్రానందాన్ని కలిగిస్తే ఇక్కడ దొరికే కాఫీ, తేనే, మసాలా దినుసులు, బాంబో చికెన్, బొంగులో చికెన్ వంటల గుమగుమలు పర్యటకుల నోటికి పనిచెపుతాయి.
అయితే ఇందులో ప్రముఖంగా అరకు, కాఫీ పంటకు ప్రసిద్ధి చెందింది. ఇటీవల కాలంలో దేశ ప్రధాని నరేంద్ర మోడీ సైతం తన ‘మన్ కి బాత్’ ప్రసంగంలో ఈ అరకు కాఫీ ఘుమఘుమల పై ముచ్చటించిన విషయం తెలిసిందే. దీనితో దేశ వ్యాప్తంగా ఈ అరకు కాఫీ రుచి పై ఆసక్తి మొదలయ్యింది.
ఇటు ఏపీ రాజధాని అమరావతి లోని అసెంబ్లీ ప్రాంగణంలో స్పీకర్ అయ్యన్నపాత్రుడు చేతుల మీదుగా అరకు కాఫీ స్టాల్స్ ను ప్రారంభించింది ఏపీ ప్రభుత్వం. ఉప ముఖ్యమంత్రి పవన్ కు, స్పీకర్ అయ్యన్నకు, డిప్యూటీ స్పీకర్ RRR కు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వయంగా తన చేతులతో తానే ఈ అరకు కాఫీ ని అందించారు.
ఇప్పుడు ఇదే విధంగా పార్లమెంట్ ఆవరణలో కూడా అరకు కాఫీ ని రెండు స్టాల్స్ లో అందుబాటులో ఉంచేందుకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తెలంగాణకు హైద్రాబాద్ బిర్యానీ, ఆంధ్రప్రదేశ్ కు అరకు కాఫీ అన్నట్టుగా ఏపీ బ్రాండ్ గా మారనుంది ఈ అరకు వ్యాలీ కాఫీ.




