వేసవి కాలంలో కూడా చాలా చల్లగా ఉండే ఆంధ్రా ఊటీ అరకు. కానీ ఇప్పుడు శీతాకాలంలోనే అరకు చాలా వేడెక్కిపోయింది.
ఓ పక్క టిడిపి, మరో పక్క వైసీపి అరకు శాసనసభ అభ్యర్ధులను ప్రకటించడంతో రెండు పార్టీలలో అసమ్మతి సెగలు మొదలయ్యాయి.
ఇటీవలే చంద్రబాబు నాయుడు అరకు అభ్యర్ధిగా దొన్నదొరను ప్రకటించడంతో, ఆ టికెట్ ఆశిస్తున్న టిడిపి సీనియర్ నేత అబ్రహం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. తాను టిడిపి రెబెల్ అభ్యర్ధిగా పోటీ చేసి గెలిచి, అరకు సీటుని చంద్రబాబు నాయుడుకి బహుమతిగా అందిస్తానని ప్రకటించారు. దీంతో అరకు టిడిపిలో వేడి మొదలైంది.
ఇక వైసీపి అరకు సిట్టింగ్ ఎమ్మెల్యే చెట్టి ఫల్గుణని జగన్మోహన్ రెడ్డి ఈసారి పక్కనపెట్టేసి అరకు ఎంపీ గొడ్డేటి మాధవిని నియోజకవర్గం ఇన్చార్జిగా నియమించడంతో వైసీపిలో కూడా సెగలు మొదలయ్యాయి.
సిట్టింగ్ ఎమ్మెల్యే చెట్టి ఫల్గుణ అనుచరులు ఆమెకు అడుగడుగునా నిరసనలు తెలియజేస్తుండటంతో ఆమె ఇల్లు గుమ్మం దాటి బయటకు అడుగు బయటకు పెట్టలేని పరిస్థితి నెలకొంది.
మాధవిని మాపై బలవంతంగా రుద్దొద్దు అంటూ హుకుంపేట జెడ్పీటీసీ రాగం మత్స్యలింగం అనుచరులు రోడ్లపైకి వచ్చి నిరసనలు తెలియజేస్తూ భారీ ర్యాలీ నిర్వహించారు.
ఈ విషయం తెలుసుకున్న జగన్మోహన్ రెడ్డి, గొడ్డేటి మాధవిని నియోజకవర్గం ఇన్చార్జి పదవి నుంచి తప్పించి ఆమె స్థానంలో రాగం మత్స్యలింగంను అరకు వైసీపి అభ్యర్ధిగా ప్రకటించారు.
మత్స్య లింగాన్ని అరకు శాసనసభ అభ్యర్ధిగా, కొట్టగుళ్ళి భాగ్యలక్ష్మిని లోక్సభ నియోజకవర్గం ఇన్చార్జిగా జగన్ ప్రకటించడంతో సిట్టింగ్ ఎంపీ గొడ్డేటి మాధవి అనుచరులు కూడా ఇప్పుడు రోడ్లపైకి వచ్చి నిరసనలు తెలియజేస్తున్నారు.
కానీ ఎట్టి పరిస్థితులలో మత్స్య లింగాన్ని, కొట్టగుళ్ళి భాగ్యలక్ష్మిని మార్చే ప్రసక్తి లేదని జగన్ స్పష్టం చేయడంతో అరకు సిట్టింగ్ ఎమ్మెల్యే చెట్టి ఫల్గుణ, ఎంపీ గొడ్డేటి మాధవి ఇద్దరి పరిస్థితి అయోమయంగా మారింది. కనుక ఇప్పుడు వారిద్దరూ కలిసి అసమ్మతి రాగాలాపన చేస్తున్నారు.
సర్వే నివేదికల ఆధారంగానే జగన్ అభ్యర్ధులను ఎంపిక చేస్తున్నట్లు చెప్పుకొంటున్నా, పార్టీలో ఈ ఒత్తిళ్ళకు తలొగ్గి మళ్ళీ మార్చాల్సి వస్తుండటం విశేషం. కనుక జగన్ ఖరారు చేసి ప్రకటిస్తున్న జాబితాలలో అభ్యర్ధులకు టికెట్లు ఖాయమని అనుకోవడానికి లేదని అర్దమవుతోంది. పార్టీలో ఒత్తిళ్ళు పెరిగితే జాబితాలలో అభ్యర్ధులు చివరి నిమిషంలో కూడా మారిపోయే అవకాశం ఉందని భావించవచ్చు.




